సమయానికి వైద్యం అందక వ్యక్తి మృతి
● ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం
ఎవరూ లేని వైనం
● మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు
బ్రహ్మంగారిమఠం : సకాలంలో వైద్య సేవలు అందకపోవడంతో తమ కుటుంబ సభ్యుడు మృతి చెందాడంటూ బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఎవరూ లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బ్రహ్మంగారిమఠంలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దర్శనం కోసం శ్రీకాళహస్తి నుంచి శనివారం రాత్రి రామయ్యతో పాటు కూతురు, కోడలు కారు తీసుకొని వచ్చారు. దేవస్థానం పరిధిలో ఉన్న గోవిందమ్మ సదనంలో రూమ్ తీసుకుని ఉన్నారు. ఆదివారం ఉదయం స్వామిని దర్శించుకొని సిద్దయ్యమఠం వెళ్లాలని అనుకున్నారు. ఉదయం 8 గంటల సమయంలో రామయ్య ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. బి.మఠంలో ఎక్కడా ఎంబీబీఎస్ డాక్టర్లు లేరు. ఆర్ఎంపీలు ఉన్నారు. ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. అక్కడికి రామయ్యను తీసుకొని కుటుంబ సభ్యులు వెళ్లగా.. డోర్ తీసి ఉంది తప్ప, ఏ ఒక్కరూ లేరు. కనీసం స్టాఫ్ నర్సు కూడా లేరు. రామయ్య కుటుంబ సభ్యులు అరుస్తున్నా పలికే దిక్కులేకపోవడంతో.. కారులో మైదుకూరుకు తరలించారు. దారిలోనే రామయ్య(61) ప్రాణాలు విడిచారు. అనంతరం బి.మఠం చేరుకున్న కుటుంబ సభ్యులు మాట్లాడుతూ బ్రహ్మంగారిమఠంలో ఉన్న ఆసుపత్రిలో కనీసం నర్సు ఉన్నా ప్రాణాలు దక్కేవని ఆవేదన వెలిబుచ్చారు. అక్కడ ఎవరూ లేకపోవడంతోనే తమ పెద్ద దిక్కు మృతి చెందినట్లు వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికై నా బి.మఠం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.


