ఉపాధ్యాయురాలికి కలెక్టర్ పరామర్శ
నెల్లూరు(దర్గామిట్ట): ఆటో డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న టీచర్ హరితను కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం పరామర్శించారు. బాలాయపల్లి మండలంలో ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న హరిత గురువారం గూడూరు నుంచి బాలాయపల్లికి టాటా మేజిక్ వాహనంలో వెళ్తున్న సమయంలో డ్రైవర్ దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కలెక్టర్ పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలిని ఓదార్చి ధైర్యం చెప్పారు. దాడి సమయంలో ఆమె చూపిన ధైర్యసాహసాలను ప్రత్యేకంగా అభినందించారు. కత్తిపోట్ల గాయాలున్నట్లు వైద్యులు చెప్పగా కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తరఫున బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆమెకు ధైర్యశాలి అవార్డు కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట డీఈఓ బాలాజీరావు ఉన్నారు.


