ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలు వీడాలి
● ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
విద్యాసాగర్రావు
నెల్లూరు(అర్బన్): ఉద్యోగులు, కార్మికులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలు మానుకోవాలని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఎసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్రావు డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం భోజన విరామ సమయంలో కలెక్టరేట్ వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. వందలాది మంది ఉద్యోగులు తరలివచ్చారు. ఈ సందర్భంగా విద్యాసాగర్రావు మాట్లాడుతూ ఉద్యోగుల రక్షణ, పెన్షన్, ఇంక్రిమెంట్లు తదితర బాధ్యతల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుకొంటున్నాయని విమర్శించారు. కేంద్రం కరోనా లాంటి కష్టకాలంలో ఎవరికీ తెలియకుండా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులతోపాటు ఉద్యోగుల హక్కులు కూడా కాలరాయబడ్డాయన్నారు. సీపీఎస్ను రద్దు చేయాలని, ఓపీఎస్ను పునరుద్ధరించాలని, కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తున్నారన్నారు. ఈ విధానాలు ప్రమాదకరమన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపధ్యక్షుడు అజయ్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను కారుచౌకగా ప్రైవేట్ శక్తులకు కట్టబెడుతున్నారన్నారు. భవిష్యత్లో రైల్వేస్టేషన్లు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోతాయన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బలిజేపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, లక్కాకుల పెంచలయ్య, ఆంజనేయవర్మ, లక్ష్మి, స్వర్ణలత, సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్, ఏపీ ఎడ్యుకేషన్ అసోసియేషన్, సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.


