వనదుర్గమ్మకు వందనం
ఏడుపాయల్లో పోటెత్తిన భక్తజనం
● మార్మోగిన శివ నామస్మరణం
పాపన్నపేట(మెదక్): ఎల్లలు దాటి తరలి వచ్చిన భక్తులతో వనదుర్గమ్మ సన్నిధి జన సంద్రంగా మారింది. మహాశివరాత్రిని పురస్కరించుకొని మూడు రోజులపాటు జరిగే జాతర ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఉత్సవంగా గుర్తింపు పొందిన ఏడుపాయల జాతరలో ప్రభుత్వం తరఫున మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, శివానీ దంపతులు దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. పూజలు చేసి ఉత్సవాన్ని ప్రారంభించారు. కలెక్టర్ రాహుల్రాజ్ దంపతులు, ఎస్పీ శ్రీనివాస్రావు, అదనపు కలెక్టర్ నగేశ్, ఈఓ వీరేశం, ఏపీ చంద్రశేఖర్ అమ్మవా రికి, శివునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంజీరా నదిలో ఏర్పాటు చేసిన శివుని విగ్రహానికి పూజలు, గంగమ్మకు హారతినిచ్చి జాతర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడు రోజులపాటు జరిగే ఈ జాతర కనులపండువగా నిర్వహిస్తామన్నారు. ఇందు కోసం మూడు వేల మంది సిబ్బందితో ఏర్పాట్లు చేశామని చెప్పారు. జాతరకు భారీ ఏర్పాట్లు ఉదయం నుంచి మొదలైన భక్తుల రాక సాయంత్రానికి జోరందుకుంది. ఏడుపాయలకు తరలి వచ్చిన భక్తులు శివాలయంలో శివదీక్షలు చేపట్టి సాయంత్రానికి పండ్లతో ఉవవాసాన్ని విడిచారు. రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు పార్కింగ్ స్థలం నుంచి జాతర వరకు ఉచిత బస్సులు నడిపారు. వీటిని కలెక్టర్ రాహుల్రాజ్ ప్రారంభించారు. ట్రాఫిక్ ఇబ్బంది, ధర్శన ఇక్కట్లు లేకుండా ఎస్సీ శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిరంతర తాగునీరు, విద్యుత్ను అధికారులు అందించారు. డాక్టర్ దీక్ష ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది సేవలు అందించారు.
వనదుర్గమ్మకు వందనం


