కేతకీకి శివరాత్రి శోభ
● విద్యుత్ కాంతులీనుతున్న ఆలయం ● తరలిరానున్న నాలుగు రాష్ట్రాల భక్తులు ● ఆలయం వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ● భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
ఝరాసంగం(జహీరాబాద్): మహాశివరాత్రి వేడుకలకు ఝరాసంగం శ్రీ కేతకీ సంగమేశ్వరాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని భక్తులు తరలి రానున్నారు. ప్రతీ ఏటా తొమ్మిది రోజులపాటు జాతర బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి, పార్వతీ పరమేశ్వరుల కల్యాణం, స్వామి వారి విమాన రథోత్సవం ఉంటాయి. రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరించారు. ప్రధాన చౌరస్తాలో భారీ కమాన్లను ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలు మొత్తం విద్యుత్ దీపాలతో వెలుగులీనుతోంది.
దివ్యాంగులకు ప్రత్యేక క్యూ
విగ్రహాలను వివిధ రకాల పూలతో అలంకరించారు. ధర్మ, ప్రత్యేక, వీఐపీ లైన్లతో స్వామివారికి దర్శించుకునే సదుపాయం కల్పించారు. శివదీక్ష భక్తులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక క్యూ ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీరు, మరుగుదొడ్లు, స్నానపు గదులు, చలువ పందిర్లు, పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా 150 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం హెల్త్ క్యాంపులు, పోలీస్ చెక్ పోస్టులు, సహాయ కేంద్రాలు అందుబాటులో ఉంచారు.
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఆర్టీసీ ఆధ్వర్యంలో జహీరాబాద్ నుంచి కేతకీ ఆలయం వరకు ప్రత్యేకంగా బస్సులను నడుపుతున్నారు. మహాశివరాత్రి పర్వదినం ఆదివారం సెలవు రావడంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సుమారు 5 లక్షలకు పైగా రావచ్చని అంచనా వేస్తున్నారు. జాతర ఉత్సవాల్లో భాగంగా కేంద్ర ,రాష్ట్ర మంత్రులతో పాటు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, నాయకులు హాజరుకానున్నారు.
కేతకీకి శివరాత్రి శోభ


