ఈజీగా డబ్బు సంపాదించాలని..
● చోరీలు, దారి దోపిడీలు.. దొంగల అరెస్టు ● కేసు వివరాలు వెల్లడించిన ఏసీపీ సదానందం
మద్దూరు(హుస్నాబాద్): వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం చేర్యాల పోలీస్ స్టేషన్లో హుస్నాబాద్ ఏసీపీ సదానందం కేసు వివరాలు వెల్లడించారు. దూల్మిట్ట మండలంలోని జాలపల్లి గ్రామానికి చెందిన గుండెల్లి రమేశ్, లింగాపూర్కు చెందిన మాసంపల్లి రాములు సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో దొంగతనాలు, దోపిడీలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో నర్సయపల్లిలో బెల్ట్షాప్ నిర్వాహకులు ఏల్లా కవితతో పాటు ఆమె భర్త వెంకటేశంను బెదిరించి ఆమె మెడలోని 3తులాల బంగారు పుస్తెలతాడు, 2తులాల నల్లపూసల తాడు, రూ.53వేలు ఎత్తుకెళ్లారు. బైరాన్పల్లి గ్రామంలో చామంతుల కల్పన మెడలో నుంచి బంగారాన్ని దోచుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అలాగే జాలపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి 10తులాల పట్టాగొలుసులు, రూ.5వేల నగదు ఎత్తుకెళ్లారు. కూటిగల్ సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళుతున్న ఖాతాకు చెందిన కొలిపాక లింగంను మార్గమధ్యలో కత్తితో బెదిరించి అతని వద్ద ఉన్న గొర్రెపిల్ల,సెల్ఫోన్ను ఎత్తుకెళ్లారు. చోరీ డబ్బులతో రమేశ్, రాములు క్రికెట్ బెట్టింగ్లు, గోవా క్యాసినోతో పాటు ఇతరత్ర జూదాల్లో పెట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో శనివారం లింగాపూర్ గ్రామ శివారులో బైక్పై అనుమానాస్పదంగా తిరుగుతున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద చోరీ చేసిన బంగారం, వెండి ఆభరణాలు, బైక్ ,కత్తితో పాటు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చేర్యాల సీఐ రమేశ్, మద్దూరు ఎస్ఐ మహ్మద్ అసీఫ్ ఉన్నారు.


