కేంద్ర ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యం
ప్రత్తిపాడు: దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడమే కేంద్రం లక్ష్యమని టుబాకో బోర్డు చైర్మన్ సీహెచ్. యశ్వంత్ అన్నారు. వట్టిచెరుకూరు మండలం వింజనంపాడులోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం కేంద్ర బడ్జెట్ 2026పై గెస్ట్ లెక్చర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా టుబాకో బోర్డు చైర్మన్ సీహెచ్.యశ్వంత్ హాజరయ్యారు. యశ్వంత్ మాట్లాడుతూ వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డ్ సృష్టించారన్నారు. సబ్కా సాథ్ సబ్ కా వికాస్ లక్ష్యానికి అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. 2026 కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి, ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వడం అభినందనీయమన్నారు. డిజిటల్ మౌలిక వసతుల విస్తరణ, ఈ–గవర్నెన్స్ బలోపేతం, ఎగుమతుల ప్రోత్సాహానికి టెక్నాలజీ వినియోగం వంటి చర్యలు భారత వాణిజ్య రంగాన్ని బలపరుస్తాయని వివరించారు. భారతీయ జనతా యువ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు అనిమేష్ బిశ్వాస్ మాట్లాడుతూ స్టార్టప్లు, ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెనన్స్, గ్రీన్ టెక్నాలజీ వంటి రంగాలకు ప్రోత్సాహం ఇవ్వడం వలన యువతకు విశేష అవకాశాలు లభిస్తాయన్నారు. టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి, పెట్టుబడుల వృద్ధి ద్వారా ‘వికసిత భారత్‘ లక్ష్య సాధన వేగవంతమవుతుందని వివరించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ కోయి సుబ్బారావు, కార్యదర్శి కోయి శేఖర్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.బాబు, అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ కె.హరిబాబు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
– టుబాకో బోర్డు చైర్మన్ సీహెచ్.యశ్వంత్


