నేడు ఐఎఫ్ఆర్, రేపు మిలాన్ విన్యాసాలకు సాగరతీరం ముస్తాబు
ఐఎఫ్ఆర్కు ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఇప్పటికే విశాఖకు చేరుకున్న దేశాధ్యక్షురాలు
మిలాన్ను ప్రారంభించనున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్
20న ఐయాన్స్ కాన్క్లేవ్.. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న భారత్
సాగర తీరాన 72 దేశాల నావికాదళాల సంగమం
భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు
నింగీనేలా నివ్వెరబోయేలా నీలిసంద్రం యుద్ధనౌకలను మోహరించిందా.. పోటెక్కిన అలలు సమరోత్సాహంతో ఎగసి పడుతున్నాయా.. కెరటాల హోరు స్నేహ శంఖారావం పూరిస్తోందా.. అన్నట్టు అద్భుత విన్యాసాల వీక్షణకు విశాఖ తీరం ముస్తాబైంది. భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలను చాటేలా.. మిత్రదేశాల సమన్వయంతో జరిగే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్), మిలాన్– 2026, ఐయాన్స్ కాన్క్లేవ్లకు తూర్పు తీరం వేదికవుతోంది. బుధ, గురువారాల్లో అద్భుత విన్యాసాలతో భారత నౌకాదళం తన సైనిక పరాక్రమ విశ్వ రూప ప్రదర్శనకు సర్వసన్నద్ధమైంది.
విశాఖ సిటీ: ‘సౌభ్రాతృత్వం, సహకారం, సమన్వయం‘ అనే నినాదంతో ఐఎఫ్ఆర్, మిలాన్, విన్యాసాలు జరగనున్నాయి. ఈ విన్యాసాల కోసం 72 దేశాల నుంచి నాలుగు వేల మందికి పైగా నావికాదళ అధికారులు, విదేశీ ప్రతినిధులు విశాఖకు చేరుకున్నారు.
ఒకేసారి మూడు ప్రధాన వేడుకలు
దేశ స్వాతంత్య్ర చరిత్రలో ఒకేసారి మూడు ప్రధాన నౌకాదళ కార్యక్రమాలను (ఐఎఫ్ఆర్, మిలాన్, ఐయాన్స్) నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ‘మహాసాగర్’ దార్శనికతలో భాగంగా.. సముద్ర భద్రత, పరస్పర సహకారాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం. దశాబ్దం తర్వాత నగరంలో ఈ ఫ్లీట్ రివ్యూను ‘యునైటెడ్ త్రూ ఓషన్స్’ (సముద్రాల ద్వారా ఏకమవుదాం) అనే ప్రత్యేక థీమ్తో నిర్వహిస్తున్నారు. బుధవారం ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్), 19న మిలాన్–2026 విన్యాసాలతో పాటు 20న ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం(ఐయాన్స్) సదస్సుకు విశాఖ తీరం ఆతిథ్యమిస్తోంది.
నేడు విన్యాసాలు తిలకించనున్న రాష్ట్రపతి
ఇండియన్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్)కు ముఖ్య అతిథిగా భారత సర్వసైన్యాధ్యక్షురాలు, దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతున్నారు. ఆమె మంగళవారం సాయంత్రమే విశాఖకు చేరుకున్నారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి వేడుకలు ప్రారంభమవుతాయి. 9 గంటలకు రాష్ట్రపతి నేవల్ డాక్ యార్డ్కు చేరుకుంటారు. అనంతరం ఆమె సుమేధ అనే యుద్ధనౌకపై (ప్రెసిడెన్షియల్ యాచ్) ప్రయాణిస్తూ.. సముద్రంలో లంగరు వేసిన 71 యుద్ధ నౌకలను వీక్షిస్తారు. ఇందులో 52 భారతీయ నౌకలు, 19 విదేశీ యుద్ధనౌకలు ఉన్నాయి.
ప్రతి నౌకలోని సైనికులు తమ దేశ సంప్రదాయ పద్ధతిలో రాష్ట్రపతికి వందనం సమరి్పస్తారు. 50కి పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఆకాశంలో అద్భుతమైన విన్యాసాలు చేస్తూ రాష్ట్రపతికి సెల్యూట్ చేస్తాయి. సముద్రం మధ్యలో మార్కోస్ కమాండోలు శత్రువులను ఎలా ఎదుర్కొంటారో ప్రత్యక్షంగా ప్రదర్శిస్తారు. నౌకాదళ విమానాల ‘ఫ్లై పాస్ట్’, సముద్ర గర్భంలో జలాంతర్గాముల విన్యాసాలనూ నౌకాదళ సైనికులు ప్రదర్శిస్తారు.
ప్రత్యేక ఆకర్షణగా సిటీ పరేడ్
విశాఖ తీరాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టేలా ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ గురువారం జరగనుంది. ఈ మెగా ఈవెంట్.. సముద్ర భద్రత, ప్రపంచ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలకు ప్రతీకగా నిలవనుంది. గురువారం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఆర్కే బీచ్ వద్ద సాగరతీరం వెంబడి ఈ పరేడ్ జరుగుతుంది. ఈ భారీ ప్రదర్శనను ప్రజలు వీక్షించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో 45 విదేశీ నౌకాదళ మార్చింగ్ బృందాలు, 8 అంతర్జాతీయ నావికాదళ బ్యాండ్లు ప్రతిభను చాటనున్నాయి. భారత సైన్యం, నౌకాదళం, వాయుసేన, కోస్ట్ గార్డ్ బృందాలతో పాటు విదేశీ సైనిక బృందాలు కవాతు నిర్వహిస్తాయి.
ఈ పరేడ్లో భారత నౌకాదళానికి చెందిన ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లతో ‘ఎయిర్ పవర్ డెమాన్్రస్టేషన్’ మొదలవుతుంది. అలాగే భారతదేశ సంస్కృతిని తెలిపే జానపద కళారూపాలు, వివిధ రాష్ట్రాల శకటాలు, విదేశాల సంస్కృతులను ప్రతిబింబించే ప్రదర్శనలు ఉంటాయి. ఇందులో ఎన్సీసీ, సీ క్యాడెట్ కార్ప్స్, నేవీ చి్రల్డన్ స్కూల్ విద్యార్థులు పాల్గొననున్నారు. పరేడ్ చివరలో సముద్రంలో లంగరు వేసిన యుద్ధనౌకల ‘సెరిమోనియల్ ఇల్యూమినేషన్’ (దీపకాంతులతో అలంకరణ), లేజర్ లైట్ షో, బాణసంచా, డ్రోన్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
రెండు దశల్లో మిలాన్
మిలాన్–2026 విన్యాసాలు విశాఖలోని తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ ఈ విన్యాసాలను ప్రారంభిస్తారు. ఇవి 19 నుంచి 20 వరకు హార్బర్ ఫేజ్, 21 నుంచి 25 వరకు సీ ఫేజ్లో జరగనున్నాయి. హార్బర్ ఫేజ్లో సాంస్కృతిక కార్యక్రమాలు, అంతర్జాతీయ సముద్ర సెమినార్లు, ద్వైపాక్షిక చర్చలు, మిలాన్ విలేజ్ ప్రదర్శనలు ఉంటాయి. సీ ఫేజ్లో భాగంగా సముద్ర గర్భంలో అసలైన యుద్ధ విన్యాసాలు జరుగుతాయి. ఇందులో యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, ఎయిర్ డిఫెన్స్, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లు, క్లిష్టమైన నౌకా విన్యాసాలు నిర్వహిస్తారు.
20న ఐయాన్స్ కాన్క్లేవ్
హిందూ మహాసముద్ర నౌకాదళ సింపోజియం (ఐయాన్స్) ఈ నెల 20న హోటల్ నోవొటెల్లో జరగనుంది. ఈ సదస్సులో 42 దేశాల నౌకాదళాధిపతులు పాల్గొని సముద్ర భద్రత, విపత్తు నిర్వహణపై చర్చిస్తారు. ఈ సందర్భంగా భారత్ 2025–27 కాలానికి గానూ ’ఐయాన్స్’ అధ్యక్ష పదవిని థాయిలాండ్ నుంచి స్వీకరించనుంది.
72 దేశాల నుంచి 71 యుద్ధ నౌకలు
ఐఎఫ్ఆర్, మిలాన్ వేడుకల్లో మొత్తం 72 దేశాలు పాల్గొంటున్నాయి. 71 యుద్ధ నౌకలు (19 విదేశీ నౌకలతో కలిపి), 50కిపైగా విమానాలు ఈ ప్రదర్శనలో కనువిందు చేయనున్నాయి. అమెరికా, రష్యా, జపాన్, ఆస్ట్రేలియా, యూకే, ఫిలిప్పీన్స్, యూఏఈ వంటి ప్రధాన దేశాలు తమ శక్తివంతమైన నౌకలను పంపాయి.
ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రధాన ఆకర్షణ
ఐఎఫ్ఆర్, మిలాన్ ద్వారా భారత్ తన స్వదేశీ పరిజ్ఞానాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు సిద్ధమైంది. ఈ విన్యాసాల్లో ప్రధాన ఆకర్షణగా ‘ఐఎన్ఎస్ విక్రాంత్’ నిలవనుంది. దీంతో పాటు ఐఎన్ఎస్ విక్రమాదిత్య కూడా జతకట్టడం విశేషం. రెండు విమాన వాహక నౌకలు ఒకేసారి కవాతు నిర్వహించడం భారత రక్షణ రంగ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం.
ఇవి కాకుండా విధ్వంసక నౌకలు, అత్యాధునిక జలాంతర్గాములు, విశాఖపట్నం క్లాస్ డి్రస్టాయర్లు, నీలగిరి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్లు కూడా సముద్ర గర్భంలో భారత్ పటిష్టతను చాటనున్నాయి. మిగ్–29కె, పి–8ఐ వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో కలిపి 50కి పైగా ఎయిర్క్రాఫ్ట్లు గగనతలంలో విన్యాసాలు ప్రదర్శించనున్నాయి.
రాష్ట్రపతికి ఘన స్వాగతం
గోపాలపట్నం: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంగళవారం విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. విశాఖలో నిర్వహించనున్న ఫ్లీట్ రివ్యూను ప్రారంభించేందుకు ఆమె నగరానికి విచ్చేశారు. విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తదితరులు రాష్ట్రపతికి ఆతీ్మయంగా స్వాగతం పలికారు.


