ఆలయ అభివృద్ధిపై పట్టింపేది ?
● ధూపదీప నైవేద్యాలకు అందని డబ్బులు ● ఇబ్బందుల్లో అర్చకులు
చెన్నూర్రూరల్: చెన్నూర్ మండలంలోని సుద్దాల గ్రామంలోని ఎంతో చరిత్ర ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధిపై పట్టింపు లేకుండా పోతోంది. ఇక్కడ ధూప, దీప నైవేద్యాలకు డబ్బులు అందని పరిస్థితి. దీంతో అర్చకులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆలయం లోపల వర్షపునీరు ఊరుస్తుంది. చర్యలు చేపట్టాల్సిన ఉన్న సంబంధిత శాఖల అధికారులు తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. దాతలు ముందుకు రావాలని, దేవాదాయ, ధర్మాధాయశాఖ అధికారులు పట్టించుకుని ఆలయాన్ని అభివృద్ధి చేయాలని పలువురు భక్తులు కోరుతున్నారు.
చరిత్ర ఇలా..
గ్రామానికి వచ్చిన ఒక ముని వాగుఒడ్డున చింతచెట్టు కింద సీతారాములు, లక్ష్మణుడు, అంజనేయస్వామి రాతి విగ్రహాలను బయటకు తీసినట్లు చరిత్ర చెబుతోంది. అక్కడ వాగు ఒడ్డున ఒక పందరి వేసి విగ్రహాలు ప్రతిష్ఠించారు. పట్టణానికి చెందిన రామగుడు కిష్టయ్య అనే భక్తుడి కలలో శ్రీరాముడు కనిపించి తనకు ఆలయం నిర్మించాలని చెప్పగా, గ్రామస్తుల సహాయంతో డంగు సున్నంతో 1910లో మందిరం నిర్మింపజేశారు. సీతా, రామ, లక్ష్మణుడు, ఆంజనేయుల పంచలోహ విగ్రహాలు తెప్పించి ప్రతిష్ఠించారు. అప్పుడు ఆయన వెలిగించిన అఖండ దీపం ఇప్పటికీ వెలుగుతూనే ఉంది.


