లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు కనిపిస్తోంది : మాజీమంత్రి హరీశ్రావు
జగిత్యాల: పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చి నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సైతం ఎంపీ వ్యాఖ్యలను వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. ఈ నెల 20న కేసీఆర్ నాయకత్వంలో జీవన్రెడ్డి బీఆర్ఎస్లో చేరనున్న సందర్భంగా జగిత్యాలలో నిర్వహిస్తున్న సభాస్థలి ఏర్పాట్లను కేటీఆర్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ బీజేపీ ఎంపీలు క్షమాపణ చెప్పాల్సిందిపోయి వెనుకేసుకొస్తున్నారని, కేసీఆర్ నాయకత్వంలో నాలుగు కోట్ల మంది ప్రజలు ఒక్కటై తెలంగాణను సాధించుకున్నారన్నారు.
బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే ఘాటైన జవాబు ఇచ్చేవారని, రాజ్యసభలో ముగ్గురు ఎంపీలు ఉంటే కేంద్రమంత్రి కాళేశ్వరం ప్రాజెక్ట్పై మాట్లాడితే దీటైన జవాబు ఇచ్చారని పేర్కొన్నారు. లోక్సభలో కాంగ్రెస్ 8, బీజేపీ 8 మంది ఎంపీలు ఉంటే కనీసం పల్లెత్తు మాట మాట్లాడలేదని, దిష్టి»ొమ్మల్లా ఉన్నారని చెప్పారు. తెలంగాణను కించపరిచేలా మాట్లాడితే సీఎం రేవంత్రెడ్డి కనీసం స్పందించకపోవడం శోచనీయమన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదని, పార్లమెంట్లో 2/3 మెజారిటీ ఉంటేనే బిల్ పాస్ అవుతుందని, మెజారిటీ లేకున్నా ప్రవేశపెట్టి దేశంలోని మహిళలకు అన్యాయం చేశారని చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీ దొందూదొందేనని, ఒకవైపు మహిళాబిల్లుపై కాంగ్రెస్ మద్దతివ్వలేదని, కాంగ్రెస్ నాయకుల ఇళ్లు ముట్టడించాలని బీజేపీ నాయకులు పిలుపునిస్తే.. సీఎం రేవంత్రెడ్డి మాత్రం కేంద్రమంత్రి శ్రీనివాస్వర్మ ఇంటికి వెళ్లి బ్రేక్ఫాస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి పార్లమెంట్లో మహిళాబిల్లు, లోక్సభ సీట్ల పెంపు విషయంలో హైబ్రిడ్ విధానాన్ని తీసుకొచ్చారు...కానీ మహిళాబిల్లు విషయంలో సైతం మోసం చేశారని ఆరోపించారు.
కేసీఆర్ నాయకత్వంలో జీవన్రెడ్డి బీఆర్ఎస్లో చేరుతున్నారని, ఆయన చేరిక ఉత్తర తెలంగాణలో బలం ఇస్తుందని, విలువలతో రాజకీయం చేసే నాయకుడు జీవన్రెడ్డి అని పేర్కొన్నారు. నాలుగు కోట్ల ప్రజల నుంచి వస్తున్న మాట రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి అన్నదే వినిపిస్తోందన్నారు. దానికి సంకేతమే బీఆర్ఎస్లో జీవన్రెడ్డి చేరిక అన్నారు.
సింహం బయటకు వస్తే గుంటనక్కలు భయపడుతున్నాయి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సింహం బయటకు వస్తే గుంటనక్కలు భయపడుతు న్నాయని కాంగ్రెస్ నాయకులనుద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ జగిత్యాలలో సభ నిర్వహిస్తుంటే సీఎం రేవంత్రెడ్డి మేడిగడ్డలో నిర్వహిస్తారట...రెండేళ్ల తర్వాత మేడిగడ్డ గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. జగిత్యాలలో హైబ్రిడ్ ఎమ్మెల్యే అని, ఏ పార్టీలో ఉన్నాడో ఆ ఎమ్మెల్యేకే తెలియదని సంజయ్కుమార్నుద్దేశించి అన్నారు. జగిత్యాల నుంచే జైత్రయాత్ర ప్రారంభమవుతుందని, కాంగ్రెస్ నాయకుల్లో భయం పట్టుకుందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటి సైతం అమలు చేయలేదని, కేసీఆర్ సభను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా పార్టీ సమష్టిగా పనిచేసి ముందుకెళ్తామన్నారు. చాలాకాలం క్రితం జగిత్యాలలో సభ నిర్వహించామని, జీవన్రెడ్డి చేరికను అందరూ ఆహ్వానిస్తున్నారని తెలిపారు. జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని, జగిత్యాల నుంచే మళ్లీ పునర్వైభవం సాధించేందుకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం కోసం జగిత్యాల ప్రజల ఆశీర్వాదంతో కదం తొక్కుతూ ముందుకెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యేలు రాజేశ్వర్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, సంజయ్, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జ్లు పాల్గొన్నారు.


