భక్త జనసంద్రంగా సత్రశాల
సత్రశాల(రెంటచింతల): మహాశివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ప్రముఖశైవక్షేత్రం సత్రశాల శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లిఖార్జునస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తజనం పోటెత్తి తరలివచ్చారు. వేకువజామునుంచే వివిధ ప్రాంతాలనుంచి భక్తులు తరలివచ్చి దేవస్థానానికి సమీపంలోని పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలను ఆచరించి మల్లన్నస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దేవస్థానం ప్రధాన అర్చకుల నేతృత్వంలో పలువురు వేదపండితులు ప్రత్యేక పూజలు, స్వామి వారికి రుద్రాభిషేకం, భ్రమరాంబ అమ్మవారికి శ్రీ చక్రనవవర్ణ అర్చన, కుంకుమార్చ నలు, జలబిందెలతో స్వామివారికి అభిషేకం, గంగపూజ, మంగళస్నానములు, ఖడ్గ ప్రదర్శన, అఖండ దీపారాధన నిర్వహించారు. దేవస్థానం ఆవరణలోని మండపంలో ప్రతిష్టించిన స్పర్శ స్పటికలింగం వద్ద భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుంచి సత్రశాలకు వేలమంది భక్తులు తరలివచ్చి దైవదర్శనం చేసుకున్నారని ఈఓ గాదె రామిరెడ్డి తెలిపారు. ఎస్ఐ సీహెచ్ నాగార్జున నేతృత్వంలో పోలీసులు, మాచర్ల ఆర్టీసీ డిపో మేనేజర్ బి.వీరస్వామి పలు కూడలలో సిబ్బందిని ఏర్పాటు చేసి ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం లేకుండా భద్రత చర్యలు చేపట్టారు. స్వామివారిని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి దంపతులు ఆదివారం దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా వారికి దేవస్థానం ఈఓ గాదె రామిరెడ్డి, దేవస్థానం ట్రస్ట్బోర్డు చైర్మన్ గుండా వెంకట శివయ్య, ప్రధాన అర్చకులు నేతృత్వంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
శివనామ స్మరణతో పులకించిన
సత్రశాల
భక్త జనసంద్రంగా సత్రశాల


