ఏలేశ్వరం గట్టుకు పోటెత్తిన భక్తులు
విజయపురిసౌత్: శ్రీశైల క్షేత్రానికి ఈశాన్య ద్వారంగా మహోన్నత దేవాలయంగా ప్రసిద్ధి చెందిన నాగార్జునసాగర్ జలాశయం మధ్యన సింహాపురి కొండపై వెలసిన ఏలేశ్వరస్వామి జాతరకు ఆదివారం మహా శివరాత్రిని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లోని గుంటూరు, ప్రకాశం, ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల నుంచి భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చారు. ఏలేశ్వరం గట్టు హరిహర నామస్మరణతో మార్మోగింది. ఆంధ్రా – తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో లాంచీలను ఏలేశ్వరం గట్టుకు నడిపారు. లాంచీలలో కాకుండా భక్తులు మహబూబ్నగర్, ప్రకాశం, నల్లగొండ, గుంటూరు జిల్లాలలో సాగర్ జలాశయం తీరాలను ఆనుకొని ఉన్న పలుగ్రామాలు తండాల వాసులు మరబోట్లలో, పుట్టీలలో ఏలేశ్వరం జాతరకు తరలి వచ్చారు. కొండ ఎక్కిన భక్తులకు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన పలు స్వచ్ఛంధ సంస్థలు మజ్జిగ, నీళ్ళ ప్యాకెట్లను అందజేశారు. అలాగే విజయపురిసౌత్లో శివాలయంలో అర్చకుడు జూనూతుల నరసింహమూర్తి, ప్రశాంత్ శర్మలు అమరలింగేశ్వర స్వామి ఆలయంలో అర్చకుల ఆధ్వర్యంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏలేశ్వరం గట్లు దిగువన, అనుపు వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాచర్ల రూరల్ సీఐ నఫీజ్బాష నేతృత్వంలో విజయపురిసౌత్ ఎస్ఐ అనుపు వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఏలేశ్వరం గట్టుకు పోటెత్తిన భక్తులు


