పల్నాడులో వ్యవసాయ సంక్షోభం
కూటమి నిర్లక్ష్య వైఖరే కారణం
చంద్రబాబు ప్రభుత్వం రైతులను విస్మరించింది
తక్షణమే పంటలకు సాగునీరు అందించాలి
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి
దాచేపల్లి : చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా పల్నాడు ప్రాంతంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. నారాయణపురంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో రైతులను పట్టించుకునే నాధుడే లేకుండా పోయారని ఆయన ధ్వజమెత్తారు. గతేడాది పంటలు బాగా పండితే గిట్టుబాటు ధరలేకండా చేశారని, ఈ ఏడాది ప్రత్తి పంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోతే మిర్చి పంటకు సాగునీరు ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని ఆయన మండిపడ్డారు.
రైతులకు ఇస్తామన్న అన్నదాత సుఖీభవ డబ్బులు జమ చేయాలని, గతేడాది ఇస్తామన్న రూ.20 వేలు ఇప్పటికీ ఇవ్వలేదని, ఈ సంవత్సరం ఇస్తామన్న దాంట్లో సగమే ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఏడాదికి ఉచితంగా ఇస్తామన్న గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం లేదని, మహిళలకు నెలకు ఇస్తామన్న రూ.1500 కూడా ఇవ్వటంలేదని, అసులు ఇస్తారా ఇవ్వరా అనే ప్రజలకు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఇవ్వటం లేదని, అన్ని పథకాలు అరకొరగా ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాము తెచ్చిన మెడికల్ కళాశాల, పిడుగురాళ్ల బైపాస్, మున్సిపల్ కార్యాలయాలకు శిలఫలకాలు పెట్టి ప్రారంభించటం సిగ్గుచేటన్నారు. ఎండకాలం రాకముందే గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఉందని, మేము తెచ్చిన రూ250 కోట్ల జలజీవన్ పనులు పూర్తిగా నిలిచిపోయాయని ఆయన చెప్పారు. మంచినీళ్ల కోసం మేము తెచ్చిన పైపులను కొంతమంది టీడీపీ నాయకులు దొంగిలిస్తున్నారని, చెప్పారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఇప్పటికే తిరుగుబాటు మొదలైందని, రేపు విప్లవం కూడా వస్తుందని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సాంబయ్య, మాజీ చైర్మన్ మునగా పున్నారావు, పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు కోట కృష్ణ, షేక్ సుభానీ, జెడ్పీటీసీ మూలగొండ్ల ప్రకాష్రెడ్డి, ఎంపీపీ కందుల జాను, మాజీ సర్పంచ్ మందపాటి రమేష్రెడ్డి, అధికార ప్రతినిధి షేక్ జాకీర్ హుస్సేన్, వైస్ చైర్మన్లు షేక్ ఖాదర్భాషా, కొమరబత్తిన విజయ్కుమార్, వైస్ ఎంపీపీ తండా అబ్దుల్సత్తార్, సర్పంచ్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


