ప్రభుత్వాల అరాచకాలను తిప్పికొడదాం
నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేయాలని, నూతన విత్తన చట్టం, విద్యుత్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని, ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని సీఐటీయూ, ఏఐటీయూసీల ఆధ్వర్యంలో నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. జిల్లా కేంద్రంలో పలు కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, ఏపీ డబ్ల్యూజేఎఫ్, యూటీఎఫ్, ఏపీటీఫ్ నాయకులు, స్కీం వర్కర్లు, ఉద్యోగ, ఉపాధ్యాయ, బ్యాంకింగ్, కార్మిక రైతాంగ నాయకులు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయం వద్ద నుంచి మల్లమ్మ సెంటర్ మీదుగా స్టేషన్ రోడ్డులోని గాంధీ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరం వరకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రదర్శన అనంతరం సీఐటీయూ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సభలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహమ్మద్, ఏఐటీయుసీ రాష్ట్ర నాయకులు నాగాంజనేయులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ రైతులు, కార్మికులు, స్కీం వర్కర్లు పేద ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలి కార్పొరేట్ల కోసం పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆంజనేయులు నాయక్ మాట్లాడుతూ లేబర్ కోడ్లను అమలు చేసేది లేదని కేరళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీపీఎం ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు నాగాంజనేయులు మాట్లాడుతూ కార్మిక రక్షణ చట్టం లేబర్ కోడ్ల పరిధిలో లేదని కార్మికులకు పనిచేసే ప్రదేశంలో ఏదైనా ప్రమాదం జరిగితే యాజమాన్యంకు సంబంధం లేని విధంగా కోడ్లు రూపొందించారని అన్నారు.
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు, సీపీఐ నాయకులు ఎ.మారుతీ వరప్రసాద్, రైతు సంఘం నాయకులు ఉలవలపూడి రాము, ఎన్జీఓ సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు ఎం.రాజ్యలక్ష్మి, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు బి.నాగేంద్రప్రసాద్, యూటీఎఫ్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మోహనరావు, ఏపీటీఫ్ నాయకులు బి.సంపత్బాబు, సీఐటీయూ నాయకులు డి.శివకుమారి, సిలార్ మసూద్ ఎం.ఆంజనేయులు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు మహంకాళి సుబ్బారావు, జిల్లా అధ్యక్షులు మేకపోతుల నాగేశ్వరావు. ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పలపాటి రంగయ్య, రైతు సంఘం నాయకులు సీహెచ్.సత్యనారాయణరాజు, రోడ్డ అంజిరెడ్డి, నాగేశ్వరావు పాల్గొన్నారు.


