ఆయిల్పామ్ సాగుతో మెరుగైన లాభాలు
నాదెండ్ల: దీర్ఘకాలిక ఆయిల్పామ్ సాగు వల్ల రైతులు లాభాలు ఆర్జించవచ్చని చిలకలూరిపేట ఉద్యానవన శాఖాధికారి ఆర్. శ్రీలక్ష్మీ చెప్పారు. ఉద్యానవన శాఖ, గోద్రేజ్ కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో గణపవరం, బుక్కాపురం గ్రామాల్లో రైతులకు ఆయిల్పామ్ సాగుపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆయిల్పామ్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీలు అందించి ప్రోత్సహిస్తుందన్నారు. సారవంతమైన నేల, సాగునీటి వసతి ఉంటే ఆయిల్పామ్ సాగు చేసుకోవచ్చన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. చీడపీడల యాజమాన్యం, ఎరువుల నిర్వహణ, యంత్రాల వినియోగం, ఆధునిక సాగు పధ్ధతులపై రైతులకు ఉద్యానవన శాఖ నుంచి నిరంతరం సహాయ సహకారాలు లభిస్తాయన్నారు. ఉద్యానవనశాఖ అందిస్తున్న సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గోద్రేజ్ కంపెనీ ప్రతినిధులు డాక్టర్ సుభాష్, ఉద్యానవన, వ్యవసాయ, సచివాలయ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.


