పరిశ్రమలకు భూముల బదిలీ ప్రక్రియ పూర్తిచేయండి
ఆర్డీఓలను ఆదేశించిన జిల్లా కలెక్టర్
నరసరావుపేట: జిల్లాలో పరిశ్రమలకు కేటాయించిన భూముల బదిలీ ప్రక్రియ పూర్తిచేయాలని ఆర్డీఓలను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఏపీఐఐసీ భూముల కేటాయింపు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి పరిశ్రమలకు భూముల బదలాయింపు ప్రక్రియ కీలకమన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు జిల్లాలో రూ.5వేల కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మండల వారీగా క్లస్టర్లను అభివృద్ధి చేసేందుకు కామన్ ఫెసిలిటీ సెంటర్లను అభివృద్ధి చేయాలన్నారు. నూతన పరిశ్రమలను ప్రోత్సహిస్తూ జిల్లా, నియోజకవర్గస్థాయి ర్యాంప్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జాయింట్ కలెక్టర్ సంజనా సింహా, జిల్లా పరిశ్రమల అధికారి ఎస్వీ సురేష్, ఏపీఐఐసీ జెడ్ ఎం.నరసింహారావు, ఎల్డీఎం రామ్ప్రసాద్, డీసీసీబీ సీఈఓ ఫణి కుమార్ పాల్గొన్నారు.


