మహా శివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష
పెదకాకాని: పెదకాకాని శివాలయంలో ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై గురువారం సమీక్ష సమావేశం జరిగింది. ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆలయంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. క్యూలైన్లలో తాగునీరు, మజ్జిగ, పాలు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అన్న సంతర్పణ, ప్రసాదాల పంపిణీ ఉంటాయని పేర్కొన్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కల్యాణ వేడుకను అధిక సంఖ్యలో భక్తులు తిలకించేలా ఎల్ఈడీలు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్లు, ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు. ఎమ్మెల్యే డి.0 నరేంద్రకుమార్ మాట్లాడుతూ శివరాత్రి రోజున పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని, సామాన్యులకు కూడా సకాలంలో స్వామి వారి దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డక శిరీష, తహసీల్దార్ పి.కృష్ణకాంత్, ఎంపీడీఓ రమావత్ శ్రీనివాసరావు, మంగళగిరి డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ, సీఐ టీపీ నారాయణస్వామి, పంచాయితీ కార్యదర్శి ప్రసాద్, ఈఓపీఆర్డీ కె. శ్రీనివాసరావు, ఆయా శాఖల అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
పెదకాకాని శివాలయంలో
12 నుంచి బ్రహ్మోత్సవాలు


