డ్వాక్రా రుణాల్లో అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోండి
అధికారులను ఆదేశించిన కలెక్టర్
నరసరావుపేట: డ్వాక్రా స్వయం సహాయక సంఘాల రుణాలలో జరుగుతున్న అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్థానికంగా సుమారు 120 ఫేక్ సంఘాలు సృష్టించి రూ.20 కోట్ల వరకు అక్రమాలు బయటపడటం, తాజాగా డ్వాక్రా మహిళల డబ్బుతో ఆర్పీ ఉడాయించటంపై పలువురు మహిళలు సత్తెనపల్లిరోడ్డులో ధర్నా నిర్వహించారు. ఈనేపథ్యంలో గురువారం కలెక్టరేట్లో మెప్మా, డీఆర్డీఎ అధికారులతో కలెక్టర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన విచారణలో తేలిన విషయాల ఆధారంగా తప్పుడు ధ్రువపత్రాలు, నకిలీ ఫొటోలు, జోడించి కృత్రిమ సంఘాలు ఏర్పాటు చేసి రుణాలు పొందిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించారు. అవసరమైతే వారి ఆస్తులను జప్తు చేసే చర్యలు చేపట్టాలని, ఆస్తుల అమ్మకాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మెప్మా పీడీ మురళీకృష్ణ, డీఆర్డీఎ పీడీ ఝాన్సీరాణి, జిల్లా సహకార ఆడిటర్ నాగశ్రీనివాసరావు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కల్పన, డీఎస్పీ రమణ పాల్గొన్నారు.


