కన్యాకుమారి: మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించిన పాపం విపక్షాలదే అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డం పెట్టుకుని అసంబద్ధంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలనుకున్న బీజేపీ పన్నాగాన్ని అడ్డుకున్నామని చెప్పారు. అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి, పార్లమెంటులో ఓడించామని వెల్లడించారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కన్యాకుమారిలో బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్డీఏ సర్కారు ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్నారు.
''మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేయాలని కొద్ది రోజుల క్రితం పార్లమెంటులో ప్రధానమంత్రి చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజనతో దేశ ఎన్నికల వ్యవస్థను మార్చాలన్న ఉద్దేశంతోనే ఈ బిల్లు తెచ్చారు. ఏన్డీఏ ప్రతిపాదించిన పునర్విభజనతో తమిళనాడు, కర్ణాటక, కేరళతో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం బలహీనపడుతుంది. ఇది రాష్ట్రాల సమాఖ్యకు వ్యతిరేకంగా జరిగిన దేశద్రోహ చర్య. అందుకే మేము మహిళా బిల్లును వ్యతిరేకించి, పార్లమెంటులో ఓడించాం. దేశంలోని ఏ ప్రాంత ప్రాతినిధ్యాన్నైనా తక్కువ చేసే ప్రయత్నాలను ఎప్పటికీ ఒప్పుకోమ''ని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేందుకు మోదీ సర్కారు కుట్ర పన్నుతోందని లోక్సభలో మహిళా బిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ఆరోపించారు. అధికారంలో కొనసాగడం కోసం దక్షిణాది, ఈశాన్య ప్రాంతాలకు, చిన్న రాష్ట్రాలకు లోక్సభలో ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ దేశ ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చే కుట్రగా రాహుల్ గాంధీ వర్ణించారు. కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది అసలు మహిళా బిల్లు కానే కాదని కొట్టిపారేశారు.
చదవండి: హమ్మయ్య! అమిత్ షా నవ్వారు.. రాహుల్ గాంధీ సరదా కామెంట్స్


