సగం కాలిన శవంతో రోడ్డుపై ఆందోళన | Sakshi
Sakshi News home page

సగం కాలిన శవంతో రోడ్డుపై ఆందోళన

Published Tue, Sep 26 2023 11:46 AM

Newly Married Woman Killed and Burnt for Dowry - Sakshi

బీహార్‌లోని మోతిహరిలో ఒక నవవివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కట్నం కోసమే అత్తింటివారు తమ అమ్మాయిని హత్య చేశారని  మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెను హ్యత చేసి, మృతదేహానికి రహస్యంగా దహన సంస్కారాలు నిర్వహిస్తుండగా, తమకు గ్రామస్తుల ద్వారా విషయం తెలియడంతో, తాము పెంటనే ఇక్కడికి వచ్చామని వారు తెలిపారు. 

గ్రామానికి వచ్చిన మృతురాలి కుటుంబ సభ్యులు చితిపై మండుతున్న మృతదేహాన్ని బయటకు తీసి రోడ్డుపై ఆందోళనకు దిగారు. తమ కుమార్తె చేతులు, కాళ్లు కట్టేసి, ఆమె గొంతునొక్కి చంపేశారని మృతురాలి తల్లి ఆరోపించింది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థాలానికి చేరుకుని, మృతురాలి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టంనకు తరలించారు. 

పోలీసులు మృతురాలిని సుగౌలీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శ్రీపుర్‌ గోపాల్‌పుర్‌ నివాసి పారస్‌ వర్మ కుమార్తె ఫూల్‌పరి దేవి(20)గా గుర్తించారు. మృతురాలి తండ్రి గతంలోనే మరణించాడు. దీంతో తల్లి కూలీనాలీ చేస్తూ కుమార్తెను చదివించింది. 

మృతురాలి తల్లి రామ్‌వతి మాట్లాడుతూ తన కుమార్తెకు టోలా గ్రామానికి చెందిన సుభుశ్‌ శర్మ కుమారుడు నితేష్‌ కుమార్‌తో ఈ ఏడాది మార్చ 8న వివాహం చేశానని తెలిపారు. పెళ్లయిన తరువాత నుంచి అత్తింటివారు తమ కుమార్తెను వరకట్న  వేధింపులకు గురిచేశారన్నారు. ఐదు లక్షల రూపాయలతో పాటు ఒక బైక్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని ఆమె తెలిపింది. పెళ్లయిన నాటి నుంచి తమ కుమార్తెను వేధింపులకు గురిచేశారని ఆమె ఆరోపించింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు  చేస్తున్నారు.  
ఇది కూడా చదవండి: దేశంలో తొలి సామూహిక గణేశ ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? అంతకుముందు ఏం జరిగింది?

Advertisement
Advertisement