నేటి నుంచి ‘సహకార’ నిరాకరణ
● నిరవధిక సమ్మె ప్రకటించిన సహకార సంఘాల ఉద్యోగులు
● జిల్లాలోని 99 సహకార సంఘాల్లో నిలిచిపోనున్న అన్ని రకాల సేవలు
కర్నూలు(అగ్రికల్చర్): తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబరు 6 నుంచి వివిధ రూపాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సోమవారం నుంచి నిరవధిక సమ్మె చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. గతంలో సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర ఉన్నతాధికారులను పలుసార్లు కలసినప్పటికి ఫలితం కనిపించలేదు. గుంటూరులోని సహకార శాఖ కమిషనరేట్ ఎదుట సుదీర్ఘంగా రిలే దీక్షలు చేపట్టినప్పటికీ పట్టించుకోలేదు. విధిలేని పరిస్థితుల్లోనే నిరవధిక సమ్మె చేపట్టినట్లు ఐక్య వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు హరీఫ్ బాషా తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 99 సహకార సంఘాలు ఉన్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం ముగింపుదశకు చేరుతోంది. ఈ సమయంలో రికవరీలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. సంఘాల ఉద్యోగులు సమ్మెబాట పడితే రికవరీలు నిలిచిపోనున్నాయి. రుణాల పంపిణీ ఆగిపోయే ప్రమాదం ఉంది. సహకార సంఘాల ఉద్యోగులు సమ్మె లోకి వెళితే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లనుంది.
ఇవీ డిమాండ్లు..
● జీవో 36 ప్రకారం సహకార సంఘాల ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి.
● వేతన సవరణ కార్యరూపం దాల్చేవరకు మధ్యంతర భృతి ఇవ్వాలి.
● పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలి.
● రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమాను కల్పించాలి.
● ప్రతి ఉద్యోగికి రూ.20 లక్షలు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించాలి.
● బ్యాంకు ద్వారా కాకుండా నేరుగా సంఘాల ద్వారానే రుణాలు పంపిణీ చేయాలి.
● 2019 తర్వాత సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి.
● కెపాసిటీ టు పే నిబంధనలకు సంబంధం లేకుండా ఉద్యోగులందరికీ ప్రొసీడింగ్స్ ఇచ్చి డీఎల్ఎస్ఎఫ్ ద్వారా జీతభత్యాలు చెల్లించాలి.


