పాగా కట్టి.. పెళ్లి కుమారుడై..
లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ప్రారంభమైన వెంటనే పాగాలంకరణ ప్రారంభమైంది. వివాహాల్లో పెండ్లి కుమారునికి తలపాగా చుట్టడం ఒక సంప్రదాయం. ఈ ఆచారమే శ్రీశైల ఆలయంలో ఆనవాయితీగా కొనసాగుతోంది. రాత్రి 10 గంటల తర్వాత బాపట్ల జిల్లా చీరాల మండలానికి చెందిన హస్తినాపురం వాసి ఫృధ్వి సుబ్బారావు స్వామివారికి పాగాలంకరణ చేశారు. ఈ పాగా గర్భాలయ విమాన శిఖరం నుంచి ముఖమండపంపై ఉండే నవ నందులను అనుసంధానం చేస్తూ అలంకరించారు. మొత్తం సుమారు 10 పాగాలు భక్తులు స్వామివారికి సమర్పించారు. పాగాలంకరణ జరుగుతున్నంతసేపు ఆలయంలో ఓం నమఃశివాయ అంటూ శివనామస్మరణ మారుమోగింది.


