మయూర వాహనంపై మహానందీశ్వరుడి విహారం
మహానంది: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహానందీశ్వరస్వామి దంపతులు ఆదివారం ఉదయం మయూర వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి మహానందీశ్వరస్వామి దంపతులు నంది వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తజనం మధ్య గ్రామోత్సవం కనులపండుగగా సాగింది. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ పూజల నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, రుత్విక్కులు, అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మహానందీశ్వరస్వామికి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలు అందించారు. అలాగే రూ. 15 లక్షల విలువైన సూట్రూమ్ నిర్మాణంలో భాగంగా హైదరాబాద్ నగరానికి చెందిన యలమంచిలి సాంబశివరావు, సుజాత దంపతులు రూ. లక్ష విరాళం అందించారు.


