చిలకలూరులో పార్వేట ఉత్సవం
రుద్రవరం: పార్వేట ఉత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని చిలకలూరు గ్రామంలో జ్వాలా నరసింహ స్వామి, ప్రహ్లాద వరద స్వాములకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. గ్రామస్తులంతా తెలుపుల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని ఉత్సవమూర్తులకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉత్సవం సందర్భంగా భారీగా ప్రజలు రావడంతో గ్రామంలోని అంతర్గత రహదారులన్నీ కిక్కిరిసి పోయాయి.
శనగలో పంట కోత ప్రయోగాలు
ఉయ్యాలవాడ: శనగలో పంట కోత ప్రయోగాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) వెంకటేశ్వర్లు తెలిపారు. మండలంలోని హరివరం గ్రామంలో గురువారం పంట కోత ప్రయోగాన్ని ఆయన పరిశీలించారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది రబీలో 53.801 హెక్టార్లలో రైతులు శనగ పంట సాగు చేశారన్నారు. ప్రస్తుతం కోతలు, నూర్పిడి పనులు కొనసాగుతున్నాయన్నారు. కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ ఏఓలు సుధాకర్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఏఈఓలు రాణెమ్మ, సునీత, గ్రామ వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.
‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
బనగానపల్లె రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ జనార్దన్రెడ్డి అన్నారు. కై ప గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్, బనగానపల్లె జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, కొండపేట జెడ్పీ ఉన్నత పాఠశాల, ఏపీ మోడల్ స్కూల్స్ను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయా పాఠశాలల ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. చదువుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించాలని, ఉత్తమ మార్కులు సాధించాలని సూచించారు. ఎంఈఓలు స్వరూప, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
కదంతొక్కిన కార్మికులు
నంద్యాల(న్యూటౌన్): నాలుగు లేబర్ కోడ్లను, జీరాంజీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కదం తొక్కారు. దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా నంద్యాల మార్కెట్ యార్డు నుంచి గాంధీ చౌక్ వరకు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య, సీఐటీయూ కార్యదర్శి నాగరాజు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేసి 200 రోజులు పని కల్పించి రూ. 600 కూలి ఇవ్వాలని కోరారు. వ్యవసాయ ఎరువుల ధరలను తగ్గించాలని, కౌలు రైతులకు వడ్డీలు లేకుండా రుణాలు ఇవ్వాలన్నారు. వామపక్ష ప్రజా సంఘాల నాయకులు తోట మద్దులు, రమేష్ కుమార్, లక్ష్మణ్, గౌస్, మురళీ, సోమన్న, శ్రీనివాసులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీ
కర్నూలు(అర్బన్): ఉమ్మడి జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల/కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 5, 6, 10వ తరగతుల్లో మిగులు సీట్లు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం(ఆంగ్ల మాధ్యమం) ప్రవేశాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ ఎంఈ గీత గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుందని, అర్హులైన అభ్యర్థులు తమ వివరాలను ఆన్లైన్ వెబ్సైట్ https://apbragcet.apcfss.in/లో ఈ నెల 19లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మిగులు సీట్ల భర్తీ, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న వారు తమ దరఖాస్తుల్లో ఏవైనా సవరణలు ఉంటే డీసీఓ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
చిలకలూరులో పార్వేట ఉత్సవం


