అక్రమాల్లో ‘ఘను’లు
● యథేచ్ఛగా సుద్ద అక్రమ రవాణా
● పట్టించుకోని అధికారులు
సాక్షిటాస్క్పోర్స్: ఎన్వోసీ, రాయల్టీ లేకుండా టీడీపీ నాయకులు సుద్ద అక్రమ మైనింగ్ చేస్తున్నారు. శని, ఆదివారాలు సెలవుదినాలుగా ఉన్నందున అధికారులు పట్టించుకోరన్న ధైర్యంతో అక్రమ మైనింగ్ పనులు చేస్తున్నారు. బనగానపల్లె మండలంలోని వెంకటాపురం గ్రామం నుంచి చెరువుపల్లెకు వెళ్లే రహదారిలోని చాకలికుంట సమీపంలో సుమారు నెల రోజులుగా సుద్ద అక్రమమైనింగ్ పనులు చేపడుతున్నారు. టిప్పర్ల ద్వారా గని లోపలి నుంచి సుద్దను బయటకు తీసుకొస్తున్నారు. కుప్పలుగా పోసిన సుద్దను రాయల్టీ ఉన్నావారు కొనుగోలు చేసి రవాణా చేస్తున్నారు. అక్రమ మైనింగ్ చేపట్టే వారికి టిప్పర్ ద్వారా ఖర్చులు పోను సుమారు రెండులక్షల వరకు మిగులు ఉంటుందని తెలుస్తోంది. రోజుకు రెండు టిప్పర్ల సుద్దను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. వారంలో రెండు రోజులు విక్రయిస్తే సుమారు మూడు లక్షల వరకు ఆదా ఉంటుందని సమాచారం. ఈవిధంగా నెలకు 10–12 లక్షల వరకు మిగులు ఉంటుంది. సుద్ద అక్రమమైనింగ్తో ప్రభుత్వ ఆదాయం కోల్పోతుండగా అక్రమమైనింగ్ చేపట్టేవారు సంపాదన పరులుగా మారుతున్నారు.


