ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో అన్ని పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లకు డిప్యూటీ తహసీల్దార్లను కేటాయించాలన్నారు. జిల్లాలోని 55 పరీక్షా కేంద్రాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఏర్పాటు చేయాలన్నారు. మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలకు 15,443 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం పరీక్షలకు 14,424 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సమయానికి చేరుకునేలా ఆర్టీసీ బస్సు సౌకర్యాలు కల్పించాలన్నారు. అదనపు ఎస్పీ యుగంధర్ బాబు మాట్లాడుతూ.. ప్రశ్నపత్రాల సెట్టు నంబర్లు అందిన వెంటనే పోలీసు ఎస్కార్ట్తో పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాలు తరలించే ఏర్పాట్లు చేపడతామన్నారు. అదనపు ఎస్పీ యుగంధర్ బాబు, డీఆర్ఓ రాము నాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, డీఈఓ జనార్దన్ రెడ్డి, డీఐఓ శంకర్ నాయక్, జిల్లా కార్మిక అధికారి బషీరున్నిసా, ఎస్ఎస్ఎ పీఓ నిత్యానంద రాజు, డీఈసీ సభ్యులు సునీత, సుంకన్న, మద్దిలేటి స్వామి, రమణ, శ్రీకాంత్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.


