సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
కర్నూలు(హాస్పిటల్): వైద్యులు అనవసర సిజేరియన్ శస్త్రచికిత్సలను తగ్గించి, సురక్షిత సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనరేట్ అదనపు డైరెక్టర్ డాక్టర్ అనిల్కుమార్ చెప్పారు. రాష్ట్ర మాతృ ఆరోగ్య ప్రాజెక్టులో భాగంగా అసిస్టెడ్ వైజెనల్ బర్త్ ద్వారా తల్లి–శిశు ఆరోగ్య ఫలితాల మెరుగుదలపై సోమవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఐదో ప్రాంతీయ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో కర్నూలు, అనంతపురం, నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లా లు, గుంటూరు జీజీహెచ్ నుంచి వచ్చిన సెకండరీ స్థాయి ఆసుపత్రుల్లో పని చేస్తున్న 35 మంది ప్రసూతి వైద్యులు పాల్గొన్నారు. ఫెర్నాండెజ్ హాస్పిటల్కు చెందిన ప్రసూతి వైద్యులు డాక్టర్ పల్లవి చంద్రరావు, డాక్టర్ అనితారెడ్డి ఈ శిక్షణకు రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరించారు. అసిస్టెడ్ వైజెనల్ బర్త్కు సంబంధించిన సూచనలు, నిషేదాలు, వర్గీకరణ, ఫోర్సెప్స్, వాక్యూమ్ ప్రసవాలపై సమగ్ర శిక్షణ అందించారు. ఫెర్నాండెజ్ హాస్పిటల్కు చెందిన ఏవీబీ శిక్షణా కార్యక్రమాల ప్రోగ్రామ్ లీడ్ నీనా దొండపాటి ఈ శిక్షణా కార్యక్రమ నిర్వహణను సమన్వయం చేశారు. కార్యక్రమంలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, గైనకాలజీ హెచ్ఓడీ డాక్టర్ సావిత్రి, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ శైలేష్కుమార్, రాష్ట్ర ఎంసీహెచ్ కన్సల్టెంట్ డాక్టర్ నాగేంద్ర పాల్గొన్నారు.


