ఉపాధి కరువై.. ఊరు వదిలి!
కొత్తపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో రబీ సీజన్లో వ్యవసాయ పనులు అంతంత మాత్రమే ఉండటం, ఉపాధి హామీ పనుల వేతనాలు గిట్టుబాటు కాకపోవడంతో పల్లె ప్రజలు వలస బాటపడుతున్నారు. కొత్తపల్లి మండలంలో మొత్తం 35 వేల జనాభా కాగా సుమారు 10 వేల కుటుంబాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 80 శాతం వ్యవసాయంపై అధారపడి జీవనం సాగిస్తున్నాయి. కాగా గత ఖరీఫ్, రబీలో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం వాటిల్లింది. దీంతో వ్యవసాయ పనులు పెద్దగా లేవు. మరో వైపు గ్రామాల్లోనే ఉపాధి పనులు కల్పిస్తున్నామని వలసలు వివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారుల చెబుతున్నా ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ఉపాధి వేతనం అరకొరగా పడటం, అది కూడా 15 రోజులకు ఇస్తుండటంతో ప్రజలు ఆసక్తి చూపడం లేదు. దీంతో మండలంలోని పలు గ్రామాల నుంచి దోర్నాల, కుంట, వినుకొండ, మాచర్ల, గుంటూరు ప్రాంతాల వైపు మిరకాయ కోత పనులకు మూటాముల్లె సర్దుకుని పోతున్నారు. మండలంలోని గుమ్మడాపురం, సింగరాజు పల్లె, వీరాపురం, గువ్వలకుంట్ల, బండినాయిని పాలెం ఇతర గ్రామాల నుంచి సుమారు 1500 కుటుంబాలు వలస వెళ్లినట్లు తెలుస్తోంది. సింగరాజుపల్లె, గువ్వలకుంట్ల గ్రామం నుంచి ఐదు రోజుల్లోనే దాదాపు 200 మంది వలస వెళ్లారు. వ్యవసాయ కూలీలు బడి పిల్లలతో వలస వెళ్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
ఇంటి అవసరాల కోసం పొదుపులో లోన్లు తీసుకున్నాం. ప్రతినెల కంతులు కట్టాలంటే కచ్చితంగా పనులకు పోవాలి. మా ఊర్లో ఉపాధి పనులకు పోతే లోన్లు కట్టడం కష్టం. నేను, నా కోడలు కలిసి నెలకు సుమారు రూ. 15 వేలు పొదుపు కట్టాలి. వలస పోకపోతే ఇబ్బంది అవుతుంది. మేము ప్రతి సంవత్సరం జనవరి వచ్చిందంటే ఇతర ప్రాంతాల్లో పత్తి, మిరపకాయ తెంచేందుకు వలస వెళ్తాం.
– చిట్టెమ్మ.. సింగరాజుపల్లి
ఉపాధి కరువై.. ఊరు వదిలి!
ఉపాధి కరువై.. ఊరు వదిలి!


