ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట
● కలెక్టరేట్లో నూతన ‘రెవెన్యూ క్లినిక్’
సేవా కౌంటర్ల ప్రారంభం
నంద్యాల: జిల్లాలో ప్రజల రెవెన్యూ సంబంధిత సమస్యలను వేగవంతంగా, సులభంగా పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నూతన రెవెన్యూ క్లినిక్, సేవా కౌంటర్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి శనివారం ప్రారంభించారు. కలెక్టరేట్లోని పీజిఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కార వేదిక) ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కౌంటర్ల ప్రారంభ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్కు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో నూతన షెడ్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ నూతన కౌంటర్ల ద్వారా అర్జీల స్వీకరణ ప్రక్రియ మరింత సరళంగా, పారదర్శకంగా మారుతుందన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, వృద్ధులు, దివ్యాంగులు వ్యయ ప్రయాసలు లేకుండా తమ సమస్యలను త్వరగా విన్నవించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.
● మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
శ్రీశైలం: ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కరివేన బ్రాహ్మణ సత్రం ప్రహరీ గోడను కూల్చి వేయడం దారుణమని, బ్రాహ్మణులు అంటే చులకనగా కనిపిస్తున్నారా అని దేవస్థానం అధికారులను వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. విజయవాడ దుర్గ గుడికి సంబంధించిన భూములు మొదలుకొని విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీకి సంబంధించిన వేలకోట్ల విలువైన భూములను టీడీపీ పందేరం చేస్తోందని విమర్శించారు. కరివేన సత్రం ప్రహరీ గోడ కూల్చివేతను సమాచార లోపం అని దేవస్థానం అధికారులు కప్పిపుచ్చుకోవడం సబబు కాదన్నారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఇష్టారీతిగా వ్యవహరించిన ఏసీ చంద్రశేఖర్ రెడ్డిని ఆ స్థానం నుంచి తప్పించడం కాదని, సస్పెండ్ చేయాలన్నారు. సత్రం పరిశీలనకు వచ్చిన తనను పోలీసులు, దేవస్థానం సెక్యూరిటీ గార్డులు అడుగడుగునా అడ్డుకోవడం దారుణం అన్నారు. మూడు రోజుల క్రితం శ్రీశైలం ఎమ్మె ల్యే ప్రధాన పురవీధిలో విలేకరులతో మాట్లాడారని, తాను కాటేజీలో ఉండి ప్రెస్ మీట్ పెట్టుకుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
శ్రీశైలంలో నేడు శ్రీశైల గిరిప్రదక్షిణ
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో మాఘమాస పౌర్ణమి పురస్కరించుకుని ఆదివారం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమం దేవస్థానం సాంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నట్లు దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్ల మహామంగళహారతుల అనంతరం ఈ గిరిప్రదక్షిణ ప్రారంభవుతుందన్నారు. యాత్రికులు, స్థానికులు ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు.
ప్రమాద రహిత డ్రైవర్లకు అవార్డుల ప్రదానం
నంద్యాల (వ్యవసాయం): ప్రమాద రహిత డ్రైవరులకు (యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్స్) అవార్డులను జిల్లా రవాణాధికారి రజియా సుల్తానా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని ఏడు డిపోల్లో 21 మంది డ్రైవర్లు, జిల్లా స్థాయిలో ముగ్గురు.. మొత్తం 24 మంది డ్రైవర్లు అవార్డులు అందుకున్నారన్నారు. అనంతరం జాతీయ రహదారి భద్రతా మాస ఉత్సవాలపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. డీఎంహెచ్ఓ వెంకటరమణ, డీఎఫ్ఓ శంకర్ ప్రసాద్, ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట
ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట


