చెలిమనీరే.. తాగునీరు
ఏజెన్సీలోని తాగునీటి సమస్య ఉన్న గూడేలు
ఏజెన్సీలోని గొత్తికోయలకు తప్పని తిప్పలు
ఏటూరునాగారం: ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన గిరిజనుల కష్టాలు తీరడం లేదు. ఏజెన్సీలో ఆవాసాలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న గొత్తికోయలకు స్వచ్ఛమైన తాగునీరు కరువైంది. కిలోమీటర్ల దూరం నడిచివెళ్లి వాగుల్లో చెలిమలు తోడి నీటిని తెచ్చుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 51 గొత్తికోయగూడేలు ఉన్నాయి. వీటిల్లో 3,548 మంది గొత్తికోయలు జీవనం సాగిస్తున్నారు. ఇందులో రాయబంధం, రేగులగూడెంతో పాటు మరో నాలుగు గూడేలకు రోడ్లు, తాగునీటి వసతి కల్పించారు. కానీ మిగతా 45 గూడేల్లో మాత్రం తాగునీటి కోసం గొత్తికోయలు వాగుల్లోని చెలిమలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అడవిలో కిలో మీటర్ల మేర బిందెలను చేతపట్టుకుని వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. అలాగే తాగునీటితో పాటు రోజువారి అవసరాలకు సైతం వాగునీటినే తెచ్చుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఎండాకాలం వచ్చిందంటే తాగునీటి సమస్య మరింత జఠిలంగా ఉంటుందని గొత్తికోయలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కలుషితం అవుతున్న వాగునీరు
ఏజెన్సీలో ప్రవహించే వాగుల్లోని నీరు గతంలో చెట్ల మధ్య నుంచి ఊటలు వచ్చేవి. ఆ నీటిని తాగడం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు వాగుల్లోకి వ్యర్థాలు, ప్లాస్టిక్, పశువుల కళేబరాలు వచ్చి చేరుతుండడంతో నీరు కలుషితం అవుతుంది. దీంతో వాగుల్లోని నీటిని వాడే గిరిజనులు కాచి చల్లార్చిన నీటినే తాగాలని అవగాహన సదస్సులు పెట్టి చైతన్య పరుస్తున్నారు.
అటవీశాఖ అడ్డంకులు
తాగునీటి వసతి కల్పించేందుకు జీపీలకు అటవీశాఖ అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటుంది. కమీషన్లకు కక్కుర్తి పడి ఆటోమెటిక్ బోర్లు, హెవీ వాటర్ బోర్లను నిర్మించడానికి సంబంధిత బోర్వెల్స్కు వత్తాసు పలుకుతూ బోర్లు వేయిస్తున్నారు. కానీ గిరిజనులు గొంతు తడుపుకునేందుకు తాగునీటి కోసం బోర్లు వేసేందుకు అనుమతి ఇవ్వలేదు. గతంలో మిషన్ భగీరథ పైపులైన్ అడవి మార్గం నుంచి వేసేందుకు అధికారులు నిరాకరించడంతో పైపులైన్ నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీంతో గొత్తికోయగూడేలకు తాగునీరు అందని పరిస్థితి నెలకొంది.
ఏటూరునాగారం 8
కన్నాయిగూడెం 6
వాజేడు 3
వెంకటాపురం(కె) 4
ఎస్ఎస్తాడ్వాయి 8
మంగపేట 7
గోవిందరావుపేట 5
ములుగు 2
వెంకటాపురం(ఎం) 2
కిలోమీటర్ల మేర
అడవిలో కాలినడకన ప్రయాణం
వాగుల్లో చెలిమలు తోడి
తెచ్చుకుంటున్న నీరు


