శంభో శంకరా..
వైభవంగా
మహాశివరాత్రి వేడుకలు
వెంకటాపురం(ఎం): జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివాలయాలు హరహర మహాదేవా.. శంభో శంకరా.. అంటూ శివనామస్మరణతో మార్మోగాయి. ఆదివారం ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివపార్వతుల కల్యాణ వేడుకలను తిలకించారు. ములుగులోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు ఆలయ ఆవరణలోని నందీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. శివలింగం వద్ద భక్తులు కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు మారేడు చెట్టు కింద దీపాలు వెలిగిస్తూ పూజలు నిర్వహించారు. రామప్ప ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ ఛైర్మన్ మిల్కూరి అయిలయ్య, ఈఓ బిల్ల శ్రీనివాస్, ఆలయ ఇన్స్పెక్టర్ అనిల్ ఆధ్వర్యంలో సిబ్బంది కందగడ్డ, అరటిపండ్లను ప్రసాదంగా అందించారు. రామప్పలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో 546 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించినట్లు వైద్యాధికారి శ్రీకాంత్, డాక్టర్ రిషిత తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా మెరుగైన సేవలు అందించినట్లు డీఎస్పీ కిశోర్కుమార్, సీఐ సురేశ్, ఎస్సై చల్ల రాజు తెలిపారు.
శివనామస్మరణతో
మార్మోగిన ఆలయాలు
భక్తులతో కిటకిటలాడిన
రామప్ప ఆలయం
కనులపండువగా
శివపార్వతుల కల్యాణం
శంభో శంకరా..
శంభో శంకరా..


