నేడు కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం
● చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక
ములుగు: ములుగు మున్సిపాలిటీకి ఎన్నికై న కౌన్సిలర్లు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 20 వార్డులకు 12 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 1 బీజేపీ, 2 స్వతంత్రులు గెలుపొందారు. సోమవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశ మందిరంలో కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 12:30గంటలకు చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసి చేతులు ఎత్తే పద్ధతిలో చైర్పర్సన్, వైస్ చైర్మన్ను ఎన్నుకోనున్నారు. చైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
నేటి ప్రజావాణి రద్దు
ములుగు: నేటి ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ టీఎస్.దివాకర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉండడంతో పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో నేడు జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు గమనించాలని ఆయన కోరారు.
వెంకటాపురం(ఎం): మహాశివరాత్రి సందర్భంగా రామప్ప గార్డెన్లో గంగిశెట్టి సరస్వతి జ్ఞాపకార్థం ఆమె కుమారుడు శ్రీనివాస్ ఏర్పాటు చేసిన తాగునీటి కేంద్రాన్ని ఆదివారం అదనపు కలెక్టర్ మహేందర్జీ ప్రారంభించారు. 15 ఏళ్లుగా ప్రతీ శివరాత్రికి రామప్పకు వచ్చే భక్తులకు ఉచిత మినరల్ వాటర్ను అందిస్తున్న గంగిశెట్టి శ్రీనివాస్ సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రామప్ప ఆలయ చైర్మన్ మిల్కూరి అయిలయ్య, ఈఓ శ్రీనివాస్, తహసీల్దార్ గిరిబాబు, లయన్స్ క్లబ్ సభ్యులు పింగిలి నాగరాజు, చుంచు రమేష్, గొల్లపెల్లి రాజేందర్, మామిడిశెట్టి కోటి తదితరులు పాల్గొన్నారు.
రేగొండ: మండలంలోని కోటంచలో నిర్వహించనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ పున:ప్రతిష్ట మహోత్సవం, స్వామి వారి బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయాలు ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నాయన్నారు. స్వామి వారి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం, బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని కోరారు. అనంతరం గడిపల్లి శివాలయంలో నిర్వహించిన శివరాత్రి వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాయినేని సంపత్రావు, నాయకులు ఉమేష్ గౌడ్, భిక్షపతి, రవీందర్ రావు, శ్రీనివాస్, సాంబయ్య పాల్గొన్నారు.


