క్రీడలతో మానసికోల్లాసం
ఏటూరునాగారం: క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందని సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మీనర్సింహారావు అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని కొమురంభీం మినీ స్టేడియంలో కేంద్ర ప్రభుత్వం మేరా యువ భారత్ వరంగల్ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడలను నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ముఖ్యఅతిథిగా హాజరై క్రీడలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఎస్సై రచిత్ర మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలతో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చన్నారు. యువకులకు వాలీబాల్, షటీల్, పరుగు పందెం, బాలికలకు పరుగు పందెం, షటీల్, తగ్గాఫ్ వార్ తదితర క్రీడలను నిర్వహించారు. గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్, ట్రోఫీని అందజేశారు.
మేరా యువ భారత్లో
నమోదు చేసుకోవాలి
క్రీడాకారులు మేరా యువ భారత్ పోర్టల్లో నమోదు చేసుకుంటే స్పోర్ట్స్ కిట్స్ అందించనున్నట్లు మేరా యువ భారత్ ఇన్చార్జ్ డిప్యూటీ డైరెక్టర్ దేవిలాల్ తెలిపారు. క్రీడాకారులు ఏ క్రీడల్లో రాణిస్తే దానికి కావాల్సిన క్రీడా సామగ్రిని పొందే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మాదరి మధు, నాగవత్ కిరణ్, బాలికల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రేమలీల, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ అరుణ, పీడీలు స్వరూప, శంకర్నారాయణ, యువ భారత్ వలంటీర్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
అంబులెన్స్లో ప్రసవం
మంగపేట: మండలంలోని శనిగకుంట నుంచి పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రసవించిన సంఘటన శుక్రవారం జరిగింది. నర్సింహాసాగర్ పంచాయతీ పరిధిలోని శనిగకుంట గ్రామానికి చెందిన మంకిడి కావేరి అనే గర్భిణి ప్రసవ వేదన పడుతుండటంతో స్థానిక ఆశావర్కర్ 108కు సమాచారం అందించింది. వెంటనే మంగపేట 108 సిబ్బంది హుటాహుటిన గ్రామానికి చేరుకుని కావేరికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటి రాంగాని రాము సమయస్ఫూర్తితో సుఖ ప్రసవం జరిగేలా వైద్యం అందించగా పండంటి పాపకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండటంతో అవసరమైన మందులను అందించి మంగపేట పీహెచ్సీలో చేర్పించారు.
ప్రత్యేక అలంకరణలో
గణపేశ్వరుడు
గణపురం: కోటగుళ్లలో గణపేశ్వరుడికి శుక్రవారం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.
క్రీడలతో మానసికోల్లాసం
క్రీడలతో మానసికోల్లాసం


