టెన్షన్.. టెన్షన్
– IIలోu
డిగ్రీ కళాశాలలో మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
ములుగు: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేడు(శుక్రవారం) వెలువడనున్నాయి. దీంతో అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. గెలుపోటములపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో కౌంటింగ్కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మూడు రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ పూర్తి అవుతుంది. దీంతో మున్సిపాలిటీ ఎన్నికల పోటీలో నిలిచిన అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరికొన్ని గంటల్లో కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుండడంతో గెలుస్తామో లేదోననే భయం నెలకొంది. ఓటర్లను అభ్యర్థులు ఎవరు అడిగినా మీకే ఓటు వేశామని చెబుతుండడంతో అభ్యర్థులు గెలుపోటములపై అంచనాలు వేసుకోలేక పోతున్నారు. దీంతో బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం భద్రంగా దాగి ఉన్పప్పటికీ శుక్రవారం ఓట్ల లెక్కింపుతో బయటపడనుంది.
లెక్కింపు ఇలా..
మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ కోసం 7గురు ఆర్ఓలు, 7గురు ఏఆర్ఓలు, 9 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 18 మంది కౌంటింగ్ సహాయకులను కేటాయించారు. 20 వార్డులకు గాను 7 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతీ టేబుల్పై మూడు వార్డులకు సంబంధించిన ఓట్లను లెక్కించనున్నారు. మూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితా లను వెల్లడించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన ఆనంతరం 8 నుంచి సాధారణ ఓట్లను లెక్కించనున్నారు.
71 సీసీ కెమెరాలతో నిఘా
జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని స్ట్రాంగ్ రూమ్లో బ్యాలెట్ బాక్స్లను అధికారులు భద్రపరిచారు. కౌంటింగ్ సమయంలో స్ట్రాంగ్ రూమ్ వద్ద 71 సీసీ కెమెరాలతో పకడ్బందీగా నిఘా ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు పటిష్ట బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.
ధీమాతో కాంగ్రెస్.. ఆశలపల్లకిలో బీఆర్ఎస్
ములుగు మున్సిపల్ ఎన్నికలకు తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. తొలిసారి చైర్పర్సన్ పీఠాన్ని కై వసం చేసుకునేందుకు అధికార పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్లి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని నాయకులు ధీమాతో ఉండగా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే తమకు కలిసి వస్తుందని ఆశలపల్లకిలో ఊగిసలాడుతున్నారు. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో 14 నుంచి 16 సీట్లు గెలుస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతుండగా, 9 సీట్లను గెలుచుకొని బీజేపీ, ఇండిపెండెంట్ల సహకారంతో చైర్పర్సన్ పదవిని కై వసం చేసుకుంటున్నామని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు.
‘పుర’ ఓట్ల లెక్కింపు ఇలా..
నేడు ఉదయం 8 గంటల నుంచి
కౌంటింగ్
20 వార్డులు.. 7 టేబుళ్ల ఏర్పాటు
మూడు రౌండ్లలో లెక్కింపు పూర్తి
గెలుపోటములపై ఎవరి ధీమా వారిదే..
టెన్షన్.. టెన్షన్
టెన్షన్.. టెన్షన్


