ఎదురుచూపులు
రైతుభరోసా కోసం రైతుల నిరీక్షణ
ములుగు రూరల్: యాసంగి పంటల సాగు మొదలై నెలరోజులు కావస్తున్నా రైతు భరోసా డబ్బులు ఖా తాలలో జమ కాకపోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు ప్రభుత్వం విడుదల చేస్తుందో తెలియక పెట్టుబడులకు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అప్పులు చేసి పంటలు సాగుచేస్తున్న దుస్థితి నెలకొంది. రైతు భరోసాపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో సాగు భూములకు మాత్రమే రైతు భరోసా అందించాలనే ఉద్దేశంతో శాటిలైట్ సర్వే అనంతరం డబ్బులు విడుదల చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
జిల్లాలో 1,73,970 ఎకరాల్లో సాగు
జిల్లాలోని పది మండలాల పరిధిలో మొత్తం 1,73,970 ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా 86,763 మంది రైతులు ఉన్నారు. జిల్లాలో అధిక మొత్తంలో వరి సాగు చేయడంతో పాటు పత్తి, మిర్చి, మొక్కజొన్న, అపరాల వంటి పంటలు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 1.15 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. 2024 యాసంగి సీజన్లో ప్రభుత్వం 68,687 మంది రైతులకు రైతు భరోసా రూ.64.64 కోట్లను అందించింది. 2025 వానాకాలం సీజన్లో 79,481 మంది రైతులకు రూ.99.10 కోట్లను అందించింది. ప్రస్తుతం యాసంగి పంటలసాగు పనులు చివరి దశకు చేరుకున్నా రైతుభరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో ఇంకా జమకాకపోవడంతో ఎప్పుడు పడుతాయోనని ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వ స్పందన కరువు
యాసంగి సాగు రైతుభరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. యాసంగి సాగు పెట్టుబడి సాయం ప్రభుత్వం పంటల సాగు సమయంలో విడుదల చేయకపోవడంతో అసహనానికి గురవుతున్నారు. వ్యవసాయశాఖ మంత్రి శా టిలైట్ ఆధారంగా సాగు భూములకు అందిస్తామని తెలిపారే తప్పా ఎప్పటి వరకు భరోసా నిధులు విడుదల చేస్తారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదని పలువురు రైతులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో రైతులు యాసంగి సాగు భరోసా డబ్బులు అందుతాయా లేదా అనే సందిగ్ధంలో ఉండిపోయారు.
యాసంగి పెట్టుబడికి
ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు
సాగుభూములకే పెట్టుబడి సాయం
అంటూ ప్రచారం
ఎదురుచూపులు


