రూ.60 కోట్లతో పట్టణాభివృద్ధికి కృషి
ములుగు: ములుగు పట్టణాన్ని రూ.60 కోట్లతో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని డీఎఆల్ఆర్ ఫంక్షన్ హాల్లో మంత్రి సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రూ.10 కోట్లతో చేపడుతున్న పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. రూ.50 కోట్లతో చేపట్టనున్న పనులకు టెండర్లు పూర్తి అయినట్లు, తొందరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. 2004లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి పల్లెబాట కార్యక్రమాన్ని చేపట్టి ములుగు పట్టణాభివృద్ధికి పునాది వేయగా, అప్పటి ఎమ్మెల్యే పొదెం వీరయ్య ములుగు పట్టణంలో సీసీ రోడ్లు వేసి అభివృద్ధి పనులు చేపట్టారని వివరించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ములుగులో చేసిన అభివృద్ధి ఏమిలేదన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ములుగు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. పట్టణంలోని ప్రతీ జంక్షన్లో ఈ ప్రాంత సంస్కృతి ప్రతిభింభించేలా అభివృద్ధి చేయడంతో పాటు రహదారులను విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
మహాజాతర ప్రతిష్ట దెబ్బతీసేలా కుట్రలు
మేడారం మహాజాతర ప్రతిష్టను దెబ్బతీసేలా కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది పీఠాధిపతులు తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీ వాహనాలు భారీగా రావడంతో నాలుగు గంటల పాటు ట్రాఫిక్ సమస్య తలెత్తి ఇబ్బంది ఏర్పడిందన్నారు. ఈ సారి మేడారం జాతరకు మాస్తో పాటు క్లాస్ భక్తులు పెద్ద ఎత్తున రావడంతో జీర్ణించుకోలేని కొంతమంది జాతరపై నెగిటివ్ ప్రచారానికి ఒడిగట్టారని వెల్లడించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, నాయకులు మల్లాడి రాంరెడ్డి, బానోతు రవిచందర్, గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, బైరెడ్డి భగవాన్రెడ్డి, చింతనిప్పుల భిక్షపతి, రవీందర్రెడ్డి, పల్లె జయపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ పల్లెబాటతోనే
ములుగు అభివృద్ధికి పునాది
రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ
మంత్రి సీతక్క


