కరకట్ట పనులు త్వరగా పూర్తిచేయాలి
మంగపేట: మండల కేంద్రంలోని గోదావరి ఒడ్డు వెంట కరకట్ట నిర్మాణ పనులను పూర్తి నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ వెంకటకృష్ణ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని గంపోనిగూడెం, కమలాపురం గ్రామాల మధ్య దొంగలఒర్రె ప్రాంతంలో సీడీఓ హైదరాబాద్ డ్రాయింగ్ నమూనాతో లాంచింగ్ ఆప్రాన్ విత్క్రేడ్స్ టెక్నాలజీతో సాగుతున్న కరకట్ట నిర్మాణ పనులను వెంకటకృష్ణ సోమవారం పరిశీలించారు. డ్రాయింగ్ మ్యాప్ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గోదావరిలో 34 మీటర్ల వెడల్పుతో జింక్తో కూడిన జాలీ(మెస్) రాక్బెడ్, 1.2 మీటర్ల తిక్నెస్తో లాంచింగ్ ఆప్రాన్, ఒడ్డు వెంట 50 మీటర్ల స్లోబ్తో 0.9 మీటర్ల తిక్నెస్తో 2.5 కిలో మీటర్ల వరకు కొనసాగుతున్న పనులపై ఆరా తీశారు. పనుల వివరాలను ఇరిగేషన్ ఈఈ శంకరయ్య, ఫీల్డ్ స్టాఫ్ను అడిగి తెలుసుకున్నారు. సీడీఓ డిజైనింగ్ ప్రకారంగా పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. కంపెనీ యాజమాన్యం మాన్సూన్ ప్రారంభానికి ముందే అగ్రిమెంటు గడువులోగా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ బుచ్చిరెడ్డి, ఈఈ బాలకృష్ణ, ఇరిగేషన్ ములుగు ఎస్ఈ మోహన్రావు, ఇరిగేషన్ ఏటూరునాగారం ఈఈ శంకరయ్య, డీఈ రవికుమార్, ఏఈ వలీమ్ మహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్
వెంకటకృష్ణ
కరకట్ట పనులు త్వరగా పూర్తిచేయాలి


