భక్తులకు ఇబ్బందులు కలగొద్దు
ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ధనసరి సీతక్క పిలుపునిచ్చారు. ఆదివారం మేడారంలో జరుగుతున్న పనులను కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మేడారంలో చిలుకలగుట్ట, ట్రైబల్ మ్యూజియంను సందర్శించారు. జాతరలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. జాతర పనులన్నీ సకాలంలో పూర్తి చేశామని, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించమన్నారు. చిలకలగుట్ట ప్రాంతాన్ని సందర్శించి అక్కడ భక్తుల రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల పరిస్థితిని పరిశీలించారు. ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శించి అక్కడ చేపడుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసులకు సూచించారు. వారి వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మద్యం సేవించి వాగులోకి దిగొద్దు
ఏటూరునాగారం: మద్యం సేవించి జంపన్నవాగులోకి దిగి స్నానం చేయొద్దని మంత్రి సీతక్క అన్నారు. మేడారంలో మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. మద్యం సేవించి వాగులోకి దిగితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని, చిన్న పిల్లలను సైతం దగ్గరుండి స్నానం చేయించాలన్నారు.
మంత్రి ధనసరి సీతక్క
మేడారంలో పనుల పరిశీలన


