సీల్డ్ కవరులోనే అభ్యర్థిత్వం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించింది. 60 డివిజన్లకు గాను 44 కై వసం చేసుకుంది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ ఎవరవుతారనే దానిపై చర్చ జరుగుతోంది. మేయర్ పదవి బీసీ జనరల్కు రిజర్వు కాగా.. ఆ పార్టీ నుంచి 31మంది బీసీలు గెలుపొందారు. ఎవరో ఒకరికే మేయర్ పదవి దక్కే అవకాశం ఉండడంతో గెలిచిన అభ్యర్థులు ఆశలపల్లకిలో విహరిస్తున్నారు. గెలిచిన అభ్యర్థులు అందరినీ ఇప్పటికే క్యాంపు పేరిట షిర్డీకి తరలించారు. ఈ నెల 16న ఉదయం 11గంటలకు నేరుగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకోనున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లను సీల్డ్ కవర్లో పెట్టి కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం సమయంలో వెల్లడించే అవకాశం ఉంది.
16వ తేదీనే ప్రకటన
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎవరనేది ఈ నెల 16న ప్రకటించడం జరుగుతుంది. ఇప్పటికీ పార్టీ పరంగా ఎవరి పేరును ప్రకటించలేదు. మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎవరిని ఎంపిక చేసిందో 16న ఉదయం 11 గంటలకు జరిగే మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలోనే ప్రకటిస్తాం.
– కొక్కిరాల ప్రేమ్సాగర్రావు,
మంచిర్యాల ఎమ్మెల్యే


