పొత్తుతో సీపీఐకి ఊరట
పాతమంచిర్యాలలో కాంగ్రెస్ నాయకుల సంబరాలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ ఎత్తుగడలు ఫలితాల్లో కనిపించాయి. జిల్లాలో నాలుగు మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్ ఉన్నాయి. మంచిర్యాల కార్పొరేషన్తో పాటు లక్సెట్టిపేట, చెన్నూర్ మున్సిపాల్టీలను కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుంది. బెల్లంపల్లిలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. ఇక బీఆర్ఎస్ సీపీఐ పొత్తుతో క్యాతనపల్లి బల్దియాలో గులాబీ పార్టీ జెండా ఎగురవేసింది. ము న్సిపల్ ఎన్నికల్లో రాజకీయ నాయకుల వ్యూహాలు, ఎత్తుగడలకు భిన్నంగా పట్టణ పౌరులు తమ తీర్పును వెలువరించారు. శుక్రవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. బెల్లంపల్లి, క్యాతనపల్లిలో పార్టీ అభ్యర్థులు ఓటమి చవిచూశారు.
మంత్రి చెమటోడ్చినా..
మంత్రి వివేక్వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు పట్టణంలో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో గెలుపొందింది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కు రెండు స్థానాల ఆధిక్యతతోనే చైర్పర్సన్ పీఠం దక్కింది. ఇక క్యాతనపల్లి పరిఽధిలో బీఆర్ఎస్, సీపీఐ పొత్తు కాంగ్రెస్ గెలుపును అడ్డుకున్నాయి. ఇక్కడ మంత్రి వివేక్ ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ నివాసం ఉన్న మున్సిపాలిటీలోనే ఆ పార్టీ ఓడిపోవడం మరింత ఇబ్బందిగా మారింది.
గులాబీ పార్టీకి మిశ్రమ ఫలితం
మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి గులాబీ పార్టీకి మిశ్ర మ ఫలితం వచ్చింది. మంచిర్యాల కార్పొరేషన్లో 8 డివిజన్లు, బెల్లంపల్లిలో 14లో సీట్లు రావడంతో కాంగ్రెస్ హంగ్ వచ్చేలా, క్యాతనపల్లిలో 10, చెన్నూరులో 4, లక్సెట్టిపేటలో 3చోట్ల గెలిచింది. ఇందులో క్యాతనపల్లిలో సీపీఐతో పొత్తుతో మున్సిపల్ పీఠం కై వసం చేసుకుంది. కార్పొరేషన్లో గెలుస్తామని ఆశించిన చోట్ల అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.
బీజేపీ ఆశలు గల్లంతు
మంచిర్యాల కార్పొరేషన్లో మెజార్టీ స్థానాలు గెలుస్తామని ఆశలు పెట్టుకున్న కమలం పార్టీ నాయకులకు ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించాయి. మంచిర్యాల కార్పొరేషన్లో 20వరకు సీట్లు గెలుస్తామని చెప్పుకున్నారు. ఇందుకోసం క్యాంపులకు సైతం తరలివెళ్లారు. ఫలితాల్లో మాత్రం చాలామంది అభ్యర్థులు వెనుకబడి పోయారు. కార్పొరేషన్లో ఐదు చోట్ల, చెన్నూరులో రెండు, లక్సెట్టిపేట, బెల్లంపల్లిలో ఒకటి చొప్పున గెలిచింది. క్యాతనపల్లిలో ఒక్క చోట కూడా గెలవలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తమకు ఓటు బ్యాంకు పెరిగిందని ఆశించినప్పటికీ పట్టణ ప్రాంతంలోనూ కమలం పార్టీ ఇంకా బలంగా లేదని తేలిపోయింది.
క్యాతనపల్లిలో సీపీఐ వ్యూహాత్మకంగా బీఆర్ఎస్తో పొత్తుతో ఎన్నికలకు వెళ్లి అక్కడ నాలుగు స్థానాలు గెలుచుకుంది. మంచిర్యాలలో కాంగ్రెస్ పొత్తుతో పోటీ చేసిన ఒక్క స్థానంలోనూ ఓటమి పాలైంది. మంచిర్యాల నగరంలో ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు ఇద్దరు, జనసేన నుంచి ఒకరు గెలిచారు.
పొత్తుతో సీపీఐకి ఊరట


