కాంగ్రెస్ పతనానికి ఇది తొలి అడుగు
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ● బీఆర్ఎస్, సీపీఐ శ్రేణుల సంబురాలు
రామకృష్ణాపూర్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఓ రకంగా కాంగ్రెస్ పతనానికి తొలి అడుగులాంటివని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. క్యాతనపల్లిలో బీఆర్ఎస్–సీపీఐ పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగి 14 స్థానాలను కై వసం చేసుకోవడంతో శుక్రవారం పట్టణంలో ఇరు పార్టీల నాయకులు సంబురాలు చేసుకున్నారు. స్థానిక సూపర్బజార్ ఏరియాలో పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చారు. తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుంటామని, బీఆర్ఎస్–సీపీఐ కౌన్సిలర్లతో జాయింట్ కమిటీ ఏర్పాటు చేసి అభివృద్ధిపై దృష్టి సారిస్తామని అన్నారు. రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ స్వయంగా డబ్బులు పంపిణీ చేసినా ప్రజలు తమవైపే నిలిచారని అన్నారు. ఏఐటీయూసీ నేత సీతా రామయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, నాయకులు మేడిపెల్లి సంపత్, సుదర్శన్గౌడ్, మిట్టపెల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.


