బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి
నస్పూర్: కాంగ్రెస్ పార్టీపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి చేసిన ఘటన సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో బుధవారం జరిగిన పోలింగ్ సందర్భంగా 34వ డివిజన్ మార్టీన్ గ్రామర్ స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి శ్రీలత తిరుపతి తరుపున కోన ప్రసాద్ పోలింగ్ ఏజెంట్గా ఉన్నాడు. పోలింగ్ అనంతరం రాత్రి కాంగ్రెస్ నాయకుడు అగల్ డ్యూటి రాజు, అతని ఇద్దరు కుమారులు, వడ్లకొండ రవి మరో 30 మంది తమ ఇంటిపై దాడి చేసి తన భర్త ప్రసాద్ను అన్యాయంగా చితక బాదారని, చంపుతామని బెదిరించారని ప్రసాద్ భార్య లక్ష్మి ఆరోపించారు. గాయపడిన ప్రసాద్ను స్థానికులు వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు అగల్డ్యూటి రాజు, అతని ఇద్దరు కుమారులు, వడ్లకొండ రవి, మరో ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
కుభీర్: ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాల మేరకు మండలంలోని గొడ్సర గ్రామానికి చెందిన విద్యార్థిని (17) భైంసాలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ (ఎంపీపీఎస్) ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతురాలి స్నేహితులను విచారించగా అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో మోసగించినట్లు తేలింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
రోబోటిక్ పోటీల్లో ప్రతిభ
జన్నారం: గత నెల 10న నిర్వహించిన ఈ బోట్ ప్లస్ ఇన్నోవిటీ రోబోటిక్ చాంపియన్ షిప్ పోటీల్లో జన్నారం మండల కేంద్రంలోని స్లెట్ ఎక్సలెన్స్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రథమస్థానంలో నిలిచారు. ఆన్లైన్ విధానంలో నిర్వహించిన పోటీలలో ఏడోతరగతికి చెందిన శౌర్య, శ్రేయస్, వైభవ్ ప్రతిభ కనబర్చినట్లు విద్యాసంస్థల చైర్మన్ ఏనుగు శ్రీకాంత్రెడ్డి తెలిపారు. సదరు విద్యార్థులకు రూ.5 వేల నగదు బహుమతి అందజేసినట్లు పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ సిరిన్ ఖాన్, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.


