నేడు బొగ్గు గనుల్లో సమ్మె
శ్రీరాంపూర్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం దేశవ్యాప్తంగా అన్ని బొగ్గు గనుల్లో సమ్మె జరుగనుంది. దీని కోసం జాతీయ సంఘాలతో పాటు ప్రాంతీయ సంఘాలన్నీ సమ్మెను విజయవంతం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. సింగరేణిలో కార్మిక శక్తిని చాటడం కోసం కార్మిక సంఘాల జేఏసీలు ఏర్పడి సమ్మెను ఎలాగైనా విజయవంతం చేయాలని సంకల్పించాయి. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీతో పాటు సీఐటీయూ, ఐఎఫ్టీయూ ఇతర ప్రాంతీయ సంఘాల కూటమితో పాటు మరో జాతీయ సంఘం హెచ్ఎంఎస్తో పాటు జేఏసీ నేతలు కూడా సమ్మె పిలుపులో భాగస్వామ్యమయ్యారు. కార్మికులు ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి వాటి స్థానంలో 4 లేబర్కోడ్లను తీసుకురావడం వల్ల కార్మికవర్గం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. పర్మినెంట్ ఉద్యోగాలు ఉండవని, వేతనాల పెరుగుదల జరుగదని, కార్మిక సంఘాలు పెట్టుకునే వీలుండదని, తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెను కూడా చేయలేని దుస్థితిలో కార్మికవర్గం ఉండబోతుందని, ఈ లేబర్కోడ్లు రద్దయ్యేంత వరకు పోరాటం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నేతలు పేర్కొంటున్నారు.
సమ్మెకు బీఎంఎస్ దూరం..
నేటి దేశవ్యాప్త సమ్మెకు బీఎంఎస్ దూరంగా ఉంది. ఈ సమ్మె రాజకీయ ప్రేరేపితమని, కార్మికులు స మ్మెకు దూరంగా ఉండాలని జాతీయ సంఘమైన బీఎంఎస్ నేతలు పేర్కొంటున్నారు. ఈ చట్టాలతో కార్మికవర్గానికి మేలు జరుగుతుందని వారు పే ర్కొంటున్నారు. ఇదిలా ఉంటే సమ్మె వద్దని మ రోవైపు సింగరేణి యాజమాన్యం పేర్కొంటోంది. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న సమస్యల పరి ష్కారం కోసం సింగరేణిలో సమ్మె చేసి కార్మికులు నష్టపోవద్దని, కంపెనీకి నష్టం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఏదేమైనా నేటి సమ్మె పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యే అవకాశం ఉంది.


