పత్తి చేనులో అమర్చిన విద్యుత్ తీగలు
వేమనపల్లి: మండలంలోని బద్దెల్లి శివారు పత్తి చేనులో వన్యప్రాణులను వేటాడేందుకు అమర్చిన విద్యుత్ తీగలు తాకిన రైతు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కల్మలపేట గ్రామానికి చెందిన పారగాని రాజ్కుమార్, దుర్గం రాజన్న, హనుమండ్ల సంతోష్ బుధవారం టకిరె బాపురావ్ పత్తి చేనులో విద్యుత్ తీగలు అమర్చారు. సదరు రైతు రాత్రి మోటార్ పైప్లు మార్చేందుకు పొలం వద్దకు వెళ్ళాడు. విద్యుత్ తీగలను తాకడంతో కిందపడిపోయాడు. కొద్ది సేపటికి తేరుకుని అటవీ అధికారులకు సమాచారం అందించాడు. విద్యుత్ సరఫరా నిలిపి వేసి అటవీ రేంజర్ హఫీజొద్దీన్, డీఆర్ఓ ప్రమోద్ కుమార్, బీట్ అధికారి మహిపాల్, ట్రాన్స్కో సిబ్బంది శంకర్ ఘటనా స్థలానికి వెళ్ళారు. గడ్డి వాములో దాక్కున్న ముగ్గురు వేటగాళ్లను అదుపులోకి తీసుకుని విద్యుత్ తీగలు, గూట కర్రలను స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు రేంజర్ తెలిపారు.


