గుప్త నిధుల మోసాల గుట్టురట్టు
ఆదిలాబాద్టౌన్: గుప్త నిధుల పేరిట మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నకిలీ బాబాతో పాటు అతడి గ్యాంగ్కు సంబంధించిన ఎనిమిది మంది సభ్యులను అరెస్ట్ చేశా రు. 26మంది బాధితుల నుంచి వీరు రూ.కోటికి పైగా వసూలు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. భీంపూర్ మండలం పిప్పల్కోటికి చెందిన దర్శనాల రాజ్కుమార్ మూడేళ్ల క్రితం తనకు దేవర వస్తుందని ప్రజలను నమ్మించాడు. దీంతో ప్రజలు అతడి వద్దకు వచ్చి కష్టసుఖాలు చెప్పుకొనేవారు. తన వద్ద మంత్రశక్తి ఉందని కష్టాలను దూరం చేస్తానని నమ్మించాడు. దీంతో చాలామంది పరిచయమయ్యారు. మంత్రశక్తితో బంగారం తవ్విస్తానని నమ్మబలికాడు. బాధితుల నుంచి ఇష్టారాజ్యంగా డబ్బులు తీసుకున్నా డు. నిందితుడి భావ మహేందర్ స్నేహితులు నవీన్, అరుణ్, శ్యామ్, అఖిల్, కిరణ్తో కలిసి గుప్తనిధుల తవ్వకాలకు పథకం పన్నాడు. గుప్తనిధులు ఉన్నాయంటూ చెప్పిన వారి ఇంటికి వెళ్లి గుంత తవ్వి అందులోనుంచి ముందుగా తమతో తీసుకువచ్చిన మట్టికుండలో ఆన్లైన్లో ఆర్డర్ చేసిన నకిలీ నాణేలను వేసి ఎర్రని బట్టతో కట్టేవాడు. 41 రోజు ల పాటు దాన్ని ముట్టకుండా పూజలు చేయాలని నమ్మించేవాడు. తాను వచ్చి తీస్తానని చెప్పి డబ్బులు తీసుకుని వెళ్లిపోయేవాడు. ముందే బిందెను తీస్తే చనిపోతారని భయభ్రాంతులకు గురిచేసేవా డు. తన మిత్రులతో కలిసి 26మంది బాధితుల నుంచి ఇలా రూ.కోటి 3లక్షల 80వేలు కాజేశాడు. వీరిపై భీంపూర్ పోలీస్స్టేషన్లో ఆరు కేసులు, మావల పోలీస్ స్టేషన్లో ఒకటి, బోథ్లో రెండు, ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఒకటి, జైనథ్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. నిందితుల నుంచి కారు, బైక్, ఏడు సెల్ఫోన్లు, నకిలీ బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఆయన వెంట డీఎస్పీ జీవన్రెడ్డి, జైనథ్ సీఐ శ్రావణ్, ఎస్సై విక్రమ్ తదితరులున్నారు.


