మన్యంకొండలో శివరాత్రి వేడుకలు
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు ఉపవాస దీక్షలతో మన్యంకొండకు చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా దేవస్థానం ముందున్న కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకొన్నారు. అలాగే దేవస్థానం పక్కనున్న శివాలయంలో కూడా భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచే భక్తులు స్వామి దర్శనానికి బారులుతీరారు. కోనేరు నుంచి గర్భగుడి, అక్కడి నుంచి శివాలయం వరకు భక్తులు దైవదర్శనానికి క్యూలైన్లలో నిల్చున్నారు. కొంతమంది భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన దాసంగాలు.. తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శివరాత్రి సందర్భంగా ఆర్టీసీ మహబూబ్నగర్ నుంచి మన్యంకొండకు ప్రత్యేక బస్సులు నడిపింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మన్యంకొండలోని శివాలయంలో అర్చనలు, ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా శివాలయంలోని శివలింగాన్ని రకరకాల పూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దేవస్థానం వ్రత మండపంలో భక్తులు వ్రతాలు జరిపించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.
మన్యంకొండలో శివరాత్రి వేడుకలు


