ఎలాగైనా గెలవాల్సిందే.. ఎంతైనా పంచాల్సిందే!
● కార్పొరేషన్ ఎన్నికల్లో కొనసాగిన ప్రలోభాలు
● ఓ డివిజన్లో అత్యధికంగా ఓటుకు రూ.5 వేల వరకు అందజేత
● కార్పొరేషన్ బరిలో ఉన్న అభ్యర్థులందరికి కలిపి రూ.90 కోట్ల వరకు ఖర్చు
పాలమూరు: ‘ఇజ్జత్ కీ సవాల్ ఎలాగైనా కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవాలి, పరువు నిలబెట్టుకోవాలి’ ఇదే కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గట్టిగా నమ్ముకున్న సిద్ధాంతం. ఇందుకోసం తుది దశ ఎన్నికల్లో చివరిసారి పంపకాలు మంగళవారం రాత్రి వరకు సాగాయి. ఓట్లు వేయడానికి ఇంకా కొన్ని గంటల సమయమే మిగిలి ఉండటంతో కార్పొరేషన్లో ఉన్న 60 డివిజన్లలో కొందరు అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అంతర్గతంగా కలుస్తున్నారు. గుట్టుగా దాచి ఉంచిన మద్యం, నగదు, ఇతర కానుకలు అందజేస్తున్నారు. ఒక్కొక్క ఇంట్లో కలిసేందుకు వీలులేని చోట కుల, యువజన సంఘాల ప్రతినిధులను కలిసి క్రీడా, వంట సామగ్రి ఇస్తూ ఓటున్న సభ్యులతో తమకే వేయించమని అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
చికెన్ కావాలా? స్వీట్బాక్స్లా..
కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా పోటీలో ఉన్న అభ్యర్థులు చాలా మంది ఇంటింటికీ తిరుగుతూ మద్యం, డబ్బులు, మటన్, చికెన్ పంపిణీ చేస్తున్నారు. వద్దన్న వారికి స్వీట్బాక్స్లు అందజేస్తున్నారు. మాస్ ఏరియా పరిధిలో ఓటుకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు ఇస్తే పోటీ కొంత తీవ్రంగా ఉండి ఎలాగైనా గెలువాలని భావించిన డివిజన్లలో రూ.3 వేల వరకు ఇస్తున్నారు. మరో రెండు, మూడు డివిజన్లలో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5వేల వరకు పంపిణీ చేసినట్లు సమాచారం. ఒక డివిజన్లో అత్యధిక ధర కలిగిన మద్యం బాటిళ్లు ఇచ్చినట్లు సమాచారం. ఇక ప్రతి డివిజన్లో మద్యం నిల్వలు పెట్టుకుని చివరి రోజు ఓటర్లకు భారీగా అందించారు. మరికొందరు అభ్యర్థులు ఎదుటి వర్గం ఏమేమి పంపిణీ చేస్తున్నారో ఆరా తీసి అంతకు ఎక్కువగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఉన్న 347 మంది అభ్యర్థులు పోటీ పడి రూ.90 కోట్ల వరకు ఖర్చు చేశారు.


