సర్వం సిద్ధం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో పోలింగ్కు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఒక్కో డివిజన్లో మూడు నుంచి అయిదు వరకు ఇలా మొత్తం 272 పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ ప్రక్రియ పూర్తికి ఆర్ఓలు 20, ఏఆర్ఓలు 20 మందితో పాటు సుమారు 2,500 సిబ్బందిని నియమించారు. వీరిలో 160 మంది స్టాండ్బైగా ఉంటారు. సిబ్బందిలో ఎవరైనా హాజరుకాని పక్షంలో ఎన్నికల విధులను వీరు నిర్వర్తిస్తారు. ఇక మంగళవారం ఉయదం నుంచి సాయంత్రం వరకు స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. మొత్తం 23 రూట్లుగా విభజించగా ఆయా డివిజన్లకు ప్రత్యేక వాహనాలలో సామగ్రిని తీసుకుని తరలివెళ్లారు. వీరు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలలోనే బస చేయనున్నారు. కాగా, సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకురాలు, ఐఏఎస్ అధికారిణి కాత్యాయనీదేవి, అడిషనల్ కలెక్టర్లు మధుసూదన్ నాయక్, శివేంద్రప్రతాప్ తనిఖీ చేసి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.రామాంజులరెడ్డి, ఏఎంసీ అజ్మీరా రాజన్నలకు తగు సూచనలిచ్చారు.
ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి
జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో, భూత్పూర్లోని జెడ్పీహెచ్ఎస్ ఆవరణలో, దేవరకద్రలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సామగ్రి పంపిణీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెక్లిస్ట్ ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి పూర్తిగా అందిందా? లేదా? అనేది జాగ్రత్తగా సరి చూసుకోవాలన్నారు. సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. పోలింగ్ సామగ్రి, ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడిన బందోబస్తు ఉండాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే ఆర్ఓలు, స్పెషల్ ఆఫీసర్ల దృష్టికి తేవాలన్నారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
కార్పొరేషన్ పరిధిలో 277 పోలింగ్ కేంద్రాలు
ఎన్నికల కోసం 2,500 సిబ్బంది నియామకం
పోలింగ్ సామగ్రిని
పంపిణీ చేసిన అధికారులు
సర్వం సిద్ధం


