కందనూలు @ నాగర్కర్నూల్
● జాగీర్ కేంద్రం నుంచి
మున్సిపాలిటీగా
అవతరణ
● అంచెలంచెలుగా
అభివృద్ధి పథంలో
నాగర్కర్నూల్
● పర్యాటక హబ్గా
మినీ ట్యాంక్బండ్
కందనూలు: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నాగర్కర్నూల్కు ప్రత్యేక స్థానం ఉంది. నాడు వలసల ప్రాంతం.. నిత్యం కరువు కాటకాలకు చిరునామాగా ఉన్న కందనూలు.. ప్రస్తుతం కేఎల్ఐ సాగు నీటితో కోనసీమను తలపిస్తూ ఇతర ప్రాంతాల వారికి ఉపాధి కేంద్రంగా విరాజిల్లుతోంది. నిజాం పాలనలో 1794 నుంచి 1904 వరకు జిల్లా కేంద్రంగా, జాగీర్ కేంద్రంగా ఉండేది. మొదటి మున్సిపాలిటీగా, గ్రామపంచాయతీగా, మేజర్ పంచాయతీగా, నగరపంచాయతీగా కొనసాగిన కందనూలు ఎనిమిదేళ్ల క్రితం మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. 2016లో అక్టోబర్లో జిల్లాకేంద్రం ఏర్పాటుతో పట్టణ రూపురేఖలే మారిపోయాయి. రియల్భూమ్తో పాటు కలెక్టరేట్, జిల్లా పోలీస్ తదితర కార్యాలయాల నిర్మాణాలతో కొల్లాపూర్ చౌరస్తా వరకు పట్టణం శరవేగంగా శివారు కాలనీలకు విస్తరించింది. కేఎల్ఐ సాగునీటితో పచ్చని పంట పొలాల మధ్యన, ఆహ్లాదకరమైన వాతావరణంలో నాగర్కర్నూల్పట్టణం అభివృద్ధి పథకంలో పయనిస్తోంది.
నాగర్కర్నూల్ పట్టణానికి మణిపూసగా ఉన్న మినీట్యాంక్బండ్ పర్యాటక హబ్గా మారింది. పదేళ్ల క్రితం వరకు బోసిపోయి కనిపించే కేసరి సముద్రం చెరువు.. ప్రస్తుతం హైదరాబాద్లోని ట్యాంక్బండ్ తరహాలో అభివృద్ధి చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సీసీ రోడ్లు, పార్క్లు, చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు, ఓపెన్ జిమ్, చెరువు మధ్యలో బుద్ధుడి విగ్రహం, బతుకమ్మ ఘాట్, తదితర నిర్మాణాలు చేపట్టారు. దీంతో కందనూలు రూపురేఖలే మారిపోయాయి. ఉమ్మడి జిల్లాలో తొలి అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ ఉన్న పట్టణంగా నాగర్కర్నూల్ నిలిచింది. ఇక జిల్లా ఏర్పాటు తర్వాత రియల్ఎ స్టేట్ ఊపందుకుంది. పట్టణం వాల్ మాదిరిగా పొడవుగా ఉండడంతో నల్ల చెరువు ప్రాంతం నుంచి ఉయ్యాలవాడ, కొల్లాపూర్ చౌరస్తా, మంతటి చౌరస్తా వరకు భూముల ధరలకు రెక్కలొచ్చాయి. పదేళ్ల క్రితం వరకు రూ.20 లక్షలకు ఉన్న ఎకరా భూమి ధర ఇప్పుడు రూ.3 కోట్లకు పైగా పలుకుతోంది. ఒకవైపు రియల్ వ్యాపారం, మరోవైపు పచ్చని పంట పొలాలతో పట్టణ శివారు ఆహ్లాదంగా ఉంటుంది.
2011 సంవత్సరంలో జీఓ నంబర్ 364 ప్రకారం నాగర్కర్నూల్ను 20 వార్డులతో నగర పంచాయతీగా ఏర్పాటు చేశారు. కొంతకాలం ప్రత్యేకపాలనలో సాగిన నగరపంచాయతీకి 2014లో ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల తర్వాత మోహన్గౌడ్ తొలి చైర్మన్గా ఎన్నికయ్యారు. 2016లో జిల్లాకేంద్రంగా, 2018 మార్చిలో పురపాలిక సంఘంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగర పంచాయతీగా ఉన్నప్పుడు 20 వార్డులు ఉండగా.. మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన తర్వాత విలీన గ్రామాలతో కలిసి 24 వార్డులకు చేరింది. అప్పుడు 30,675 ఓటర్లు ఉన్నారు. 2020లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 9, ఓ స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించగా.. టీఆర్ఎస్కు చెందిన కల్పన గౌడ్ మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం పట్టణంలో 35,378 మంది ఓటర్లు ఉన్నారు.
మారిన రూపురేఖలు
పరిపాలనా
సౌలభ్యం..
నాగర్కర్నూల్ 1951లో మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. మొదటి కౌన్సిలర్ చైర్మన్గా వీఎన్ గౌడ్ ఎన్నికయ్యారు. పాలనాపరమైన వ్యవహారాల్లో ఏర్పడిన సంక్షోభంతో 1961లో మేజర్ పంచాయతీగా మార్చారు. మొదటి సర్పంచ్గా చెరువు రామారావు, తర్వాత హకీం బాలస్వామి, నర్మదాబాయి, మాసుద్దీన్ అహ్మద్ అలీ, వంగా శరత్బాబు, సంధ్యారాణి సర్పంచ్గా పనిచేశారు.
2011లో
నగరపంచాయతీగా.
కందనూలు @ నాగర్కర్నూల్
కందనూలు @ నాగర్కర్నూల్


