నలుగురు రెబల్స్పై సస్పెన్షన్ వేటు
● ఉత్తర్వులు జారీ చేసిన డీసీసీ ప్రెసిడెంట్ శివసేనారెడ్డి
● ఎన్నికల్లో ప్రభావం చూపించే వారిపైనే వేటు పడిందా ?
వనపర్తి: జిల్లా కేంద్రం, వనపర్తి మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ ఎఫెక్ట్తో పలు వార్డుల్లో పుర ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులపై ప్రభావం పడుతోందని గుర్తించిన డీసీసీ సోమవారం నలుగురిపై సస్పెన్షన్ వేటు వేసింది. సోమవారం ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి రెబల్స్ రంజిత్కుమార్, డి.వెంకటేష్, ఎన్.బాలస్వామి, ఎన్ భువనేశ్వరీలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ ప్రాథమిక నిబంధనలను పాటించకపోవటం, ఆయా వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేస్తున్న వారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కారణంగా జారీ చేసిన షోకాస్ నోటీసులకు ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో సస్పెన్షన్ వేటు వేసినట్లు డీసీసీ అధ్యక్షుడు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని సంబంధిత వ్యక్తులతో పాటు ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి. చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిలకు ప్రతులను పంపించారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో గానీ.. గత కాంగ్రెస్ చరిత్రలో రెబల్స్ను ఇలా సస్పెండ్ చేసిన దాఖలాలు లేవనే చర్చ స్థానికంగా హాట్ టాపిక్గా మారింది.
మిగిలిన వారి మాటేంటీ..?
వీరితో పాటు జిల్లా కేంద్రంలో పలు వార్డుల్లో రెబల్స్ కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. వారి వెనుక అధికార పార్టీలోని పలువురు పెద్దలు ఉన్నారు. మరి కొందరిపైనే సస్పెన్షన్ వేటు వేయటంలో ఆంతర్యమేంటినే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలోని పెద్దల వత్తిళ్లు కొందరినుద్దేశించే ఉన్నాయా.. లేక ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపిస్తారనే వారిని గుర్తించి వారిపైనే.. చర్యలు తీసుకున్నారనే అంశం పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పలువురు రెబల్స్ అభ్యర్థులు ఏకంగా ఎమ్మెల్యే ఫోటోలతో ఎన్నికల ప్రచారం చేసుకోవటం గమనార్హం.


